జనసేన కార్యకర్తలకు అండగా నిలుస్తాం: శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్..
ABN , Publish Date - Aug 02 , 2026 | 07:08 PM
జనసేన పార్టీ కార్యకర్తలకు న్యాయపరమైన అండగా నిలిచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి, ఏపీ శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్ తెలిపారు. అమరావతిలో జరిగిన జనసేన న్యాయవాదుల సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అమరావతి: జనసేన పార్టీ కార్యకర్తలకు న్యాయపరమైన అండగా నిలిచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి, ఏపీ శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్ తెలిపారు. అమరావతిలో జరిగిన జనసేన న్యాయవాదుల సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ హరిప్రసాద్ మాట్లాడుతూ.. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, వ్యక్తిగతంగా దూషించినా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఫిర్యాదులు చేయాలని న్యాయవాదులకు సూచించారు. చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో న్యాయవాదుల సేవలు ఎంతో కీలకమని అన్నారు.
వైసీపీ హయాంలో రాజకీయ కక్ష సాధింపుతో జనసేన కార్యకర్తలపై నమోదైన కేసులను వెంటనే పరిశీలించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హరిప్రసాద్ హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా కార్యకర్తలపై నమోదైన కేసుల పూర్తి వివరాలను సేకరించి జనసేన కేంద్ర కార్యాలయానికి పంపించాలని ఈ సందర్భంగా న్యాయవాదులకు ఆయన సూచించారు. అవసరమైన వారికి న్యాయ సహాయం అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్టీ కార్యకర్తల రక్షణ, న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం న్యాయవాదులు సమన్వయంతో పనిచేయాలని హరిప్రసాద్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఏపీ - ఆస్ట్రేలియా మధ్య కుదిరిన నాలుగు ఎంవోయూలు
దుర్గగుడిలో ఇన్స్టా రీల్ కలకలం.. యువతిపై పోలీసులకు ఫిర్యాదు..