Share News

2027 వన్డే ప్రపంచకప్.. జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నా: భువనేశ్వర్ కుమార్

ABN , Publish Date - Aug 10 , 2026 | 03:22 PM

భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచాడు. 2027 వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో భువీని టీమిండియాలోకి తిరిగి తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.

2027 వన్డే ప్రపంచకప్.. జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నా: భువనేశ్వర్ కుమార్
Bhuvneshwar Kumar

ఇంటర్నెట్ డెస్క్: భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచాడు. 2027 వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో భువీని టీమిండియాలోకి తిరిగి తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుత ప్రదర్శన చేసిన భువీ.. 28 వికెట్లు పడగొట్టి వరుసగా జట్టు రెండోసారి టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం భారత పేసర్లను గాయాల సమస్య వేధిస్తుండటంతో భువీని జట్టులోకి తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు 14 నుంచి జరగనున్న యూపీ టీ20 లీగ్‌లో భువీ లఖ్‌నవూ ఫాల్కన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ లీగ్‌కు ముందు భువీ మాట్లాడుతూ.. 2027 వన్డే ప్రపంచ కప్‌లో ఆడే అవకాశంపై స్పందించాడు.


‘జాతీయ జట్టు నుంచి పిలుపు వస్తే ఎందుకు వద్దంటాను? భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఎప్పుడూ సిద్ధమే. అయితే ఎంతమేర సిద్ధంగా ఉన్నానో కచ్చితంగా చెప్పలేను. నా పని క్రికెట్ ఆడటమే. అందుకే యూపీ టీ20 లీగ్‌లో ఆడేందుకు వచ్చా. మరో స్థాయికి వెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడి రాలేదు. ఐపీఎల్‌లోనూ జట్టు కోసం పరుగులు, వికెట్లు సాధించి మ్యాచ్‌లు గెలిపించాలనే ఉద్దేశంతోనే ఆడాను. ఎవరో ఏదో చెప్పారనో.. ఇంకా వేరే కారణాలతోనో ఇక్కడ ఆడటం లేదు. జాతీయ జట్టులో ఆడేందుకు ఎంత సిద్ధంగా ఉన్నానన్నది నా చేతుల్లో లేదు. నన్ను ఎంపిక చేయాలా? వద్దా? అనేది సెలెక్టర్ల నిర్ణయం’ అని భువీ స్పష్టం చేశాడు.


లఖ్‌నవూ ఫాల్కన్స్‌కు కెప్టెన్‌గా..

ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్న యూపీ టీ20 లీగ్‌ నాలుగో సీజన్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ లఖ్‌నవూ ఫాల్కన్స్‌కు నాయకత్వం వహించనున్నాడు. 24 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 34 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. తొలిసారిగా రెండు నగరాల్లో పోటీలు జరగనున్నాయి. లఖ్‌నవూలోని ఏకానా క్రికెట్‌ స్టేడియంలో లీగ్ మ్యాచ్‌లు.. అనంతరం కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్‌ స్టేడియంలో మిగిలిన మ్యాచ్‌లు జరగనున్నాయి.


ఇవి కూడా చదవండి:

ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

నకిలీ లింక్‌లతో జాగ్రత్త.. చందాదారులకు ఈపీఎఫ్ఓ సూచన

Updated Date - Aug 10 , 2026 | 03:22 PM