అభిషేక్ శర్మపై బీసీసీఐ సీరియస్.. మ్యాచ్ ఫీజులో కోత
ABN , Publish Date - Apr 03 , 2026 | 10:49 AM
ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం కేకేఆర్, ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన మ్యాచ్లో విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మపై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. అతడు అంపైర్ను దూషించాడనే కారణంతో జరిమానా విధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ ప్రవర్తనా తీరుపై బీసీసీఐ సీరియస్ అయింది. అతడు ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించాడనే కారణంతో మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా సహా ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. అంపైర్ నిర్ణయంపై అసభ్య పదజాలంతో దూషించాడనే కారణంతో లెవల్ వన్ నేరం కింద డాషింగ్ ఓపెనర్పై మ్యాచ్ రిఫరీ ఈ పనిష్మెంట్ విధించాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడిన సన్రైజర్స్ టీమ్ తొలుత బ్యాటింగ్కు దిగింది. బౌండరీలతో విరుచుకుపడిన అభిషేక్ హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో.. ముజరబాని వేసిన ఓ బంతిని షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అయితే.. వరుణ్ చక్రవర్తి పట్టిన ఆ క్యాచ్ కాస్త కన్ఫ్యూజింగ్గా ఉండటంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్కి రిఫర్ చేశాడు. క్యాచ్ పట్టుకునే సమయంలో బంతి నేలను తాకుతున్నట్లు కనిపించింది. అందరూ నాటౌట్ అనుకుంటుండగానే థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు. దీంతో అసహనానికి లోనైన అభిషేక్.. అంపైర్ను అసభ్య పదజాలంతో దూషించాడు. ఆ తర్వాత పెవిలియన్కు వెళ్లాక తన తప్పును అంగీకరించాడు.
అయితే.. మ్యాచ్లో అభిషేక్ ప్రవర్తన సరిగాలేదనే కారణంతో జరిమానా విధించేందుకు మ్యాచ్ అధికారులు నిర్ణయించారు. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. ఆర్టికల్ 2.3 కింద లెవల్ వన్ నేరాన్ని అభిషేక్ శర్మ అంగీకరించినట్టు ఐపీఎల్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎవరైనా అసభ్య పదజాలం ఉపయోగిస్తే వారికి ఆర్టికల్ 2.3 కింద లెవల్ వన్ నేరం వర్తిస్తుందని పేర్కొంది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అభిషేక్ శర్మ (48; 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు), ట్రావిస్ హెడ్ (46; 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లు), క్లాసెన్ (52; 35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (39; 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్)ల విధ్వంసంతో 20 ఓవర్లలో 226/8 భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన కోల్కతా బ్యాటర్లు తడబడటంతో 16 ఓవర్లలోనే 161 పరుగులకు పరిమితమైంది. దీంతో ఆరెంజ్ ఆర్మీ 65 పరుగుల తేడాతో గెలుపొందింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఉనద్కత్ 3 వికెట్లతో చెలరేగగా, ఇషాన్ మలింగ, నితీశ్ కుమార్ రెడ్డి చెరో 2 వికెట్లతో రాణించారు.
ఇవీ చదవండి:
ధోనీ, కపిల్కు క్షమాపణ చెబుతా!