సురక్షితంగా భారత్ చేరుకున్న పీవీ సింధు
ABN , Publish Date - Mar 03 , 2026 | 11:58 AM
పశ్చిమాసియా ప్రాంతాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆమె సురక్షితంగా భారత్ చేరుకున్నారు.
స్పోర్ట్స్ డెస్క్: గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అక్కడ భయం భయంగా ఉందంటూ ఆమె సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించారు. ఎట్టకేలకు యుద్ధం మధ్య పీవీ సింధు సురక్షితంగా భారత్ చేరుకున్నారు. మంగళవారం ఆమె దుబాయ్ నుంచి బయలుదేరి బెంగళూరు ఎయిర్పోర్టులో దిగారు. ఈ విషయాన్ని సింధు ‘ఎక్స్’లో వెల్లడించారు.
తాను సురక్షితంగా బెంగళూరుకు చేరుకున్నానని తెలిపారు. దుబాయ్ లో గడిచిన కొన్ని రోజులు అత్యంత అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కున్నానని, ఎట్టకేలకు ఇంటికి చేరుకోగలిగానని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో తమను సురక్షితంగా చూసుకోవడం కోసం దుబాయ్ అధికారులు, ఎయిర్పోర్టు సిబ్బంది, ఇమిగ్రేషన్ అధికారులు అందించిన సేవలను మాటల్లో చెప్పలేనని అన్నారు. కష్ట కాలంలో తనకు సాయపడిన వారందరికీ పీవీ సింధు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తాను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని, రీసెట్ అయ్యాక నా భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆలోచిస్తానని సింధు తన పోస్ట్లో రాసుకొచ్చారు.
పీవీ సింధు ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం గతవారం ఇంగ్లాండ్ బయల్దేరింది. దుబాయ్ మీదుగా వెళ్లే క్రమంలో అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా అక్కడి విమానాశ్రయంలో సింధు చిక్కుకున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో గత శనివారం నుంచి విమాన సర్వీసులు రద్దు కావడంతో సింధు ప్రయాణం ఆగిపోయింది. అప్పటినుంచి దుబాయ్లోనే సురక్షిత ప్రాంతంలో ఉన్నారు. ఈ క్రమంలోనే యూఏఈ, భారత్ అధికారుల సమన్వయంతో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో సింధు బెంగళూరుకు చేరుకున్నారు.
ఇవి కూడా చదవండి:
ఈ ఆటంకాలు దాటితేనే సూర్యసేన ట్రోఫీని ముద్దాడేది.. లేకుంటే ..?
తనకు ఇష్టమైన తెలుగు హీరో ఎవరో చెప్పిన సంజు