ఇండోనేషియా సుమత్రా ద్వీపంలో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 6.1గా తీవ్రత
ABN , Publish Date - Mar 03 , 2026 | 11:58 AM
ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైనట్టు యూజీజీఎస్ పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైనట్టు యునైటెడ్ జియోలాజికల్ సర్వే(యూజీజీఎస్) పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సంభవించాయని యూజీజీఎస్ తెలిపింది.
అనేక టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రదేశం కారణంగా తరచూ భూకంపాలు ఎదుర్కొనే సుమత్రా ద్వీప సమీపంలోని నీటిలో ఈ భూప్రకంపనలు సంభవించాయి. అయితే దీనివల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.
'రింగ్ ఆఫ్ ఫైర్'లో భాగమైన ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో తరచూ భూప్రకంపనలు, అగ్నిపర్వత విస్ఫోటనలు సంభవిస్తుంటాయి. ఇండోనేషియాలోని సుమత్రా ప్రాంతం తూర్పున పాపువా నుంచి పశ్చిమాన హిమాలయ ముందు భాగం వరకు 8,000 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఒక ప్రధాన టెక్టోనిక్ ఘర్షణ జోన్ వెంబడి ఉంటుంది. ఈ జోన్లోని సుమత్రా-అండమాన్ విభాగం సుంద-జావా వెంబడి ఓ సబ్డక్షన్ మెగాథ్రస్ట్ను ఏర్పరుస్తుంది. ఈ ప్రాంతంలోనే ఇండో-ఆస్ట్రేలియా, సుంద ప్లేట్లు కలుస్తాయి.
కాగా.. గతేడాది నవంబర్లో ఇండోనేషియాలోని ఆషే ప్రావిన్స్ సమీపంలో రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడింది. అంతకముందు సెప్టెంబర్లోనూ సెంట్రల్ పాపువా ప్రావిన్స్లో 6.1 తీవ్రతతో మరో భూకంపం సంభవించిందని యూజీజీఎస్ నివేదించింది.
ఇవీ చదవండి:
పాకిస్థాన్ క్రికెట్ జట్టు హీరోకు ఘోర అవమానం
పరీక్షల కాలం.. తినాలి పోషకాహారం