మహారాష్ట్ర వరదల్లో కొట్టుకుపోయిన 3 వేల సిలిండర్లు.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 09 , 2026 | 10:30 AM
మహారాష్ట్రలోని రాయగడ జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా పాతాళగంగ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ క్రమంలో గ్యాస్ ప్లాంట్ నుంచి వేల ఎల్పీజీ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోవడం స్థానికంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది..
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని రాయగడ జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా పాతాళగంగ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ క్రమంలో గ్యాస్ ప్లాంట్ నుంచి వేల ఎల్పీజీ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. రాయగడ జిల్లాలోని ఖాలాపూర్ తాలూకా చావణే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొండ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు ఒక్కసారిగా ఉధృతంగా మారి, స్థానిక హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ప్లాంట్లోకి ప్రవేశించింది. ప్లాంట్ చుట్టూ ఉన్న రక్షణ గోడలను సైతం దాటి వచ్చిన వరద నీరు.. అక్కడ నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లను చుట్టుముట్టింది. వరద నీటి ప్రవాహానికి సిలిండర్లు నీటిలో కొట్టుకుపోయాయి.
భారీ ఇనుప సిలిండర్లు నీటి ప్రవాహానికి బొమ్మల్లా కొట్టుకుపోతుంటే, అక్కడ ఉన్న సిబ్బంది వాటిని ఆపేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ప్లాంట్ నుంచి కొట్టుకుపోయిన ఈ సిలిండర్లన్నీ పక్కనే ఉప్పొంగి ప్రవహిస్తున్న పాతాళగంగ నదిలో కలిసిపోయాయి. ఇదిలా ఉంటే.. వరదల్లో కొట్టుకువచ్చిన ఆ సిలిండర్లలో గ్యాస్ ఉందా లేదా అవి ఖాళీగా ఉన్నాయా అనే విషయంపై ప్రస్తుతం స్పష్టత లేదని, వాటి భద్రతా స్థితి కూడా తెలియదని కలెక్టర్ పేర్కొన్నారు. కొందరు స్థానికులు ఒడ్డుకు కొట్టుకొచ్చిన సిలిండర్లను ఇంటికి పట్టుకోవడం కూడా వీడియోలో చూడొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని ముట్టుకోవడం, ఓపెన్ చేయడానికి ప్రయత్నించడం లేదా వాడాలని చూడటం అత్యంత ప్రమాదకరమని, అది ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎక్కడైనా సిలిండర్లు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించి, వాటికి దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
సెల్ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుగులో రైల్వేట్రాక్పై ప్రయాణికుల నడక.. వీడియో వైరల్
రూ.15 విలువైన ఆర్డర్కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్
For More Viral News And Telugu News