ఉత్తరప్రదేశ్లో ప్రకృతి బీభత్సం.. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం!
ABN , Publish Date - May 14 , 2026 | 09:24 AM
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ తుఫాన్ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగుల్చింది. బుధవారం సాయంత్రం అనూహ్యంగా మారిన వాతావరణం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెను విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రకృతి ఒక్కసారిగా ప్రకోపించింది. బుధవారం సాయంత్రం అనూహ్యంగా మారిన వాతావరణం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈదురుగాలులతో కూడిన భారీ ధూళి తుఫాను బీభత్సం సృష్టించడంతో వేర్వేరు ఘటనల్లో కనీసం33 మంది మరణించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని ఐదు జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో అపారమైన ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పలుచోట్ల గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల ధాటికి భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో అనేక గ్రామాల్లో చీకట్లు ముసురుకున్నాయి.
ఈదురుగాలుల తీవ్రతకు గోడలు కూలిపోవడం, చెట్లు విరిగి పడటం వంటి ప్రమాదాలు సంభవించి ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భదోహిలో కనీసం 16 మంది, ఫతేపూర్లో తొమ్మిది మంది, బుడౌన్లో ఐదుగురు, చందౌలిలో ఇద్దరు, సోన్భద్ర జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. కేవలం ప్రాణనష్టమే కాకుండా, అకాల వర్షాలు, గాలివాన కారణంగా వేల ఎకరాల్లో సాగు చేసిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. అనేక చోట్ల పశువులు మృత్యువాత పడగా, పేదల గుడిసెలు, పెంకుటిళ్లు ధ్వంసమయ్యాయి.
ఈ విపత్తుపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగింది. నష్ట తీవ్రతను అంచనా వేసిన ముఖ్యమంత్రి, ప్రభావిత కుటుంబాలకు తక్షణ సహాయక చర్యలు, నష్టపరిహారం అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే 24 గంటల్లోగా సహాయక పనులన్నింటినీ పూర్తి చేయాలని ఆయన జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన గడువు విధించారు.
మరోవైపు, వాతావరణం ఇంకా ఆందోళనకరంగానే ఉండటంతో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం హెచ్చరించారు. పంటలకు, పశువులకు, ఇళ్లకు జరిగిన నష్టాన్ని లెక్కించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అండగా నిలవడానికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని ఆయన హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..
రక్తపోటు నుంచి బరువు వరకు.. మందార టీతో ఎన్నో లాభాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News