ఎన్డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు
ABN , Publish Date - Aug 04 , 2026 | 09:58 PM
బెంగాల్లో టీఎంసీ రెబల్ ఎంపీల్లో కొందరి తీరు ఆసక్తికరంగా మారింది. వీరిలో ముగ్గురు ఎంపీలు ఎన్డీఏ సమావేశానికి గైర్హాజయ్యారు. అదే సమయంలో సీఎం సువేందు అధికారి ఏర్పాటుచేసిన విందులో పాల్గొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నుంచి తిరుగుబాటు చేసి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా(NPCI)లో చేరినట్లు ప్రకటించిన 20 మంది ఎంపీల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. రెండోసారి ఎన్డీఏ 'మంగళ్ మిలన్' సమావేశానికి 17 మంది ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. ముగ్గురు ఎంపీలు(అబూ తాహిర్ ఖాన్, ఖలీలుర్ రహ్మాన్, యూసుఫ్ పఠాన్) గైర్హాజరయ్యారు.
అయితే.. వీరంతా కలిసి(20 మంది ఎంపీలు) సీఎం సువేందు అధికారి ఢిల్లీలో ఏర్పాటుచేసిన విందుకు మాత్రం హాజరయ్యారు. దీంతో ప్రస్తుతం ఆ ముగ్గురు ఎంపీల వైఖరిపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. ఈ విందులో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కూడా పాల్గొన్నారు. టీఎంసీ ఎంపీల తిరుగుబాటు ప్రక్రియలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఎంసీ సీనియర్ నేత సౌగత రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటు చేసిన ఎంపీల్లో కొందరు తనతో సంప్రదింపులు జరుపుతూ తిరిగి పార్టీలో చేరే దిశగా ప్రయత్నిస్తున్నారన్నారు. అయితే.. ఎన్డీఏ సమావేశానికి గైర్హాజరైన ముగ్గురు ఎంపీలు కూడా కూటమితోనే ఉన్నారని, వారి గైర్హాజరు వ్యూహాత్మక నిర్ణయమేనని రాజకీయ వర్గాల సమాచారం. దీంతో ఈ రాజకీయ పరిణామాలు మరింత చర్చనీయాంశంగా మారాయి.
మరోవైపు.. ఈ 20 మంది ఎంపీలు ఎన్సీపీఐలో విలీనమైన అంశాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇంకా ఆమోదించలేదు. దీంతో లోక్సభ రికార్డుల్లో వారు ఇప్పటికీ టీఎంసీ ఎంపీలుగానే కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. వారిని అనర్హులుగా ప్రకటించాలని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ స్పీకర్కు ఇప్పటికే పిటిషన్ సమర్పించారు. ఈ అంశంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి:
సునేత్రపై పవార్పై 'గంగీ గుడియా' వ్యాఖ్యలు.. 'మహా' రాజీయాల్లో దుమారం!
అస్సాం సీఆర్పీఎఫ్ క్యాంపులో విషాదం.. సహచరులపై కాల్పులకు దిగిన జవాన్