జైల్లో చిగురించిన ప్రేమ.. జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Jul 17 , 2026 | 08:35 AM
రాజస్థాన్లోని జోధ్పూర్ ఓపెన్ జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు ప్రేమించుకోగా, ఆర్టికల్ 21 జీవించే హక్కు కింద వివాహం చేసుకునేందుకు ఆ రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇవ్వడంతో జులై 22న వీరి వివాహం జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్లోని జోధ్పూర్ ఓపెన్ జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు ప్రేమించుకోగా.. ఆర్టికల్ 21 జీవించే హక్కు కింద వివాహం చేసుకునేందుకు అక్కడి హైకోర్టు అనుమతి ఇచ్చింది. నాగౌర్ జిల్లాకు చెందిన మూలారామ్ 2017 నుంచి ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తుండగా, జోధ్పూర్కు చెందిన సీమా ఘడ్సే ఇష్టంలేని పెళ్లి కారణంగా భర్తను హతమార్చిన కేసులో 2019లో దోషిగా తేలింది. మాండోర్ ఓపెన్ ఎయిర్ క్యాంపులో ఖైదీలకు కల్పించే పనుల్లో భాగంగా పొలాల్లో పనిచేస్తున్న సమయంలో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత తామిద్దరూ ప్రేమలో ఉన్నట్టు, జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకుని వివాహ అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తులు డా.పుష్పేంద్ర సింగ్ భాటి, ప్రవీర్ భట్నాగర్ల ధర్మాసనం.. ఇద్దరు వ్యక్తులు తమ స్వేచ్ఛా సంకల్పంతో వివాహం చేసుకోవడం ఆర్టికల్ 21 కింద కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమని పేర్కొంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం.. కఠినమైన భద్రతా ఏర్పాట్ల నడుమ జరగనున్న వీరి వివాహ వేడుకకు ఇరు కుటుంబాల నుంచి గరిష్ఠంగా 21 మంది సభ్యులకు అనుమతి లభించింది. అలాగే పెళ్లి ఖర్చులను ఖైదీల కుటుంబాలే భరించాల్సి ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
సంక్షోభాల వేళా రైతుల సంక్షేమానికి పెద్దపీట
పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News