రేపు యువతతో ప్రధాని సంభాషణ.. ‘ఖేలో ఇండియా డైలాగ్’లో పాల్గొననున్న మోదీ
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:26 PM
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ‘ఖేలో ఇండియా డైలాగ్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. క్రీడలు, యువ నాయకత్వం, ఫిట్నెస్, దేశ నిర్మాణంపై ఆయన యువతతో చర్చించనున్నారు.
ఢిల్లీ, ఆగస్టు 27: జాతీయ క్రీడా దినోత్సవం-2026 సందర్భంగా రేపు(బుధవారం) ఉదయం 11:00 గంటలకు ‘ఖేలో ఇండియా డైలాగ్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. క్రీడలు, యువ నాయకత్వం, ఫిట్నెస్, దేశ నిర్మాణంపై యువతతో చర్చించనున్నారు. ‘యువ సంవాద్’లోని కీలక అంశాలపై మాట్లాడనున్నారు. క్రీడా మౌలిక వసతులు, కోచింగ్, స్పోర్ట్స్ సైన్స్పై ప్రత్యేక చర్చ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోని రెండు కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు.
యువ నాయకులు పెరిగేలా..
యువ నాయకత్వం, స్వచ్ఛంద సేవలను ప్రోత్సహించడం వంటి వాటిపై మోదీ ప్రసంగం ఉండనుంది. భవిష్యత్తు నైపుణ్యాలు, పౌర బాధ్యతపై ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. యువత ఆకాంక్షలు జాతీయ క్రీడా విధానంలో భాగం కావాలని ప్రధాని పిలుపునివ్వనున్నారు. అలాగే 2026 ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రతిభావంతుల గుర్తింపు, శిక్షణలపై ఆయన చర్చ నిర్వహించనున్నారు.
‘నషా ముక్త్ యువ’ ఉద్యమంపై ప్రత్యేక సంభాషణ
ప్రధాని మోదీ ‘నషా ముక్త్ యువ’ ఉద్యమంపై యువతతో ప్రత్యేకంగా సంభాషించనున్నారు. క్రీడల ద్వారా మాదక ద్రవ్యాల వ్యసనాలను రూపుమాపడానికి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా యువతతో ప్రముఖ భారత క్రీడాకారులు, పతక విజేతలు తమ అనుభవాలను పంచుకోనున్నారు. భవిష్యత్తు నిర్మాణానికి సూచనలు చేయనున్నారు.
ఇవి కూడా చదవండి...
కృతి సనన్ పక్షాన రాహుల్ గాంధీ.. మహిళలపై ట్రోల్స్ ఆపాలంటూ హితవు
ఢిల్లీలో 2,308 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు
Read Latest National News And Telugu News