51 వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 20వ రోజ్గార్ మేళాలో ప్రధాని మోదీ సందేశం
ABN , Publish Date - Sep 19 , 2026 | 04:30 PM
దేశవ్యాప్తంగా నిర్వహించిన 20వ 'రోజ్గార్ మేళా'లో 51వేల మందికి పైగా యువతకు కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వర్చువల్గా ప్రసంగించిన ప్రధాని మోదీ.. దేశాన్ని 'వికసిత్ భారత్'గా మార్చడంలో యువతదే కీలక పాత్రన్నారు.
ఢిల్లీ, సెప్టెంబర్ 19: దేశవ్యాప్తంగా ఇవాళ నిర్వహించిన 20వ 'రోజ్గార్ మేళా'లో 51వేల మందికి పైగా యువతకు కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వర్చువల్గా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, 2047 నాటికి భారత్ను 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్)గా మార్చే ప్రయాణంలో యువతదే అత్యంత కీలక పాత్ర అని స్పష్టం చేశారు.
దేశంలో పండుగల సీజన్ ప్రారంభమైన వేళ, వేలాది కుటుంబాల్లో ఈ ఉద్యోగాలు కొత్త ఆనందాన్ని నింపాయని ప్రధాని అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ను నిర్మించాలనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతున్న తరుణంలో యువత ప్రభుత్వంలో చేరుతున్నారని, వీరు తీసుకునే ప్రతి నిర్ణయం 'వికసిత్ భారత్', 'ఆత్మనిర్భర్ భారత్' ఆశయాల్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
భారతీయ యువత నైపుణ్యాలపై ప్రపంచానికి ఎంతో నమ్మకం ఉందని ప్రధాని పేర్కొన్నారు. గత కొన్నేళ్లలో దాదాపు 40 దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు యువతకు నూతన ఉద్యోగ, వ్యాపార అవకాశాలను తెచ్చాయని చెప్పారు. రూ. 60,000 కోట్ల వ్యయంతో 'పీఎం సేతు' పథకం ద్వారా 1,000 ప్రభుత్వ ఐటీఐ లను పరిశ్రమల భాగస్వామ్యంతో ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ నెట్వర్క్ భారత్లో ఉందన్న ప్రధాని, గుర్తింపు పొందిన స్టార్టప్లలో సగానికి పైగా టైర్-2, టైర్-3 నగరాల్లోనే ఉన్నాయని, చిన్న నగరాల యువత ఉద్యోగ సృష్టికర్తలుగా మారుతున్నారని ప్రశంసించారు.
ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు రూ. 1 లక్ష కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించామని, దీని ద్వారా తొలిసారి ఉద్యోగంలో చేరే దాదాపు 2 కోట్ల మంది యువతకు రూ. 15,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం లభిస్తుందని తెలిపారు.
దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో ఈ 20వ రోజ్గార్ మేళాను నిర్వహించారు. రైల్వే, హోం శాఖ, రక్షణ, రెవెన్యూ, ఆరోగ్య, ఆర్థిక సేవల శాఖల్లో ఎంపికైన అభ్యర్థులకు ఈ నియామక పత్రాలను అందించారు. ఇప్పటివరకు నిర్వహించిన రోజ్గార్ మేళాల ద్వారా మొత్తం దాదాపు 12.75 లక్షల మంది యువతకు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు లభించాయి.
ఇవి కూడా చదవండి...
మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే
హఫీజ్పేట్ ఘటన.. హోంగార్డ్ ఆనంద్పై వేటు
Read Latest Telangana News And Telugu News