కోల్కతా అగ్నిప్రమాదం.. 21కి చేరిన మృతుల సంఖ్య..
ABN , Publish Date - Jan 29 , 2026 | 06:35 PM
కోల్కతా నగరంలోని మోమో ఆహార పదార్థాల గోదాంలో జనవరి 26న అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 28 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది..
కోల్కతా, జనవరి 29: కోల్కతా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని మోమో ఆహార పదార్థాల గోదాంలో సోమవారం అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరుకుంది. మరో 28 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అక్కడి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, అలాగే రాజకీయ నాయకుల పర్యటన నేపథ్యంలో.. బుధవారం అర్ధరాత్రి నుంచి ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించామని పోలీసులు తెలిపారు.
అసలు ఏం జరిగిందంటే...
జనవరి 26(సోమవారం) గణతంత్ర దినోత్సవం వేళ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలో జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘోర విషాదాన్ని మిగిల్చింది. సోమవారం ఉదయం 3 గంటలకు ఆనంద్పూర్ ప్రాంతంలోని రెండు ఆహార గోదాంలలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే గోదాం లోపల పొడి ఆహర పదార్థాలతో పాటూ మండే వస్తువులు అధికంగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. గంటల తరబడి ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేసినా మంటలు అదుపులోకి రాలేదు. చాలా సమయం తర్వాత అగ్నిమాపక సిబ్బంది అందులో చిక్కుకున్న వారి కోసం గాలింపులు చేపట్టగా తొలి రోజు 16 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.
తాజాగా గురువారం మరో ఐదు మృతదేహాలను గుర్తించారు. దీంతో మృతుల సంఖ్య 21కి చేరింది. మిగతా వారి కోసం గాలింపు చేపడుతున్నారు. అయితే మృతదేహాలను గుర్తించడం కష్టంగా ఉన్నందున.. డీఎన్ఏ ఆధారంగా మృతదేహాల గుర్తింపు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. ఇక ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు మోమో కంపెనీ రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది. అంతేకాకుండా వారి కుటుంబాలకు ప్రతి నెలా ఆర్థిక సహాయం, వారి పిల్లల చదువు బాధ్యతలు భరిస్తామని వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్ సర్కార్ సాధించిందేమీలేదు.. ఫోన్ ట్యాపింగ్పై బీజేపీ ఎంపీ
ఫిబ్రవరిలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ ప్రదేశాలు మిస్ అవ్వొద్దు..