PM Modi: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్.. వైబ్రంట్ గుజరాత్ సదస్సులో మోదీ
ABN , Publish Date - Jan 11 , 2026 | 07:07 PM
ప్రపంచ అనిశ్చితి మధ్య భారతదేశం అపూర్వమైన నిశ్చయత దశను చూస్తోందని పరోక్షంగా బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలో ఇటీవల రాజకీయ కల్లోలాలను ప్రస్తావిస్తూ మోదీ పేర్కొన్నారు.
రాజ్కోట్: భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా దూసుకెళ్తోందని, దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ప్రపంచ అనిశ్చితి మధ్య భారతదేశం అపూర్వమైన నిశ్చయత దశ (unprecedented certainty)ను చూస్తోందని పరోక్షంగా బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలో ఇటీవల రాజకీయ కల్లోలాలను ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. రాజ్కోట్లో ఆదివారం నాడు జరిగిన వైబ్రంట్ గుజరాత్ రీజినల్ కాన్ఫరెన్స్ ఫర్ కచ్ అండ్ సౌరాష్ట్ర రీజియన్లో ప్రధాని మాట్లాడుతూ, 'రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్స్' అనే విజయ మంత్రమే భారతదేశ వృద్ధిని ప్రతిబింబిస్తోందన్నారు. మౌలిక వసతుల కల్పనతోపాటు ఇండస్ట్రీ-రెడీ వర్క్ఫోర్స్ అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు గ్రోత్ ఇంజన్లా గుజరాత్ మారిందని, కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలు అవకాశాలకే పరిమితం కాకుండా దేశ ప్రగతికి బలమైన పునాదిగా మారాయని ప్రశంసించారు.
'భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. వ్యవసాయ ఉత్పత్తులు సరికొత్త రికార్డులు సృష్టించాయి. పాల ఉత్పత్తిలో నెంబర్ వన్ రికార్డు మనదే. వ్యాక్సిన్ల అతి పెద్ద ఉత్పత్తిదారు కూడా ఇండియానే. గత 11 ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ డేటా వినియోగదారుగా కూడా ఇండియా నిలిచింది' అని ప్రధాని తెలిపారు.
మూడురోజుల పర్యటనలో భాగంగా శనివారం నాడు గుజరాత్లోని సోమనాథ్కు వచ్చిన ప్రధాని ఆదివారం నాడు స్వాభిమాన్ పర్వ్లో భాగంగా శౌర్య యాత్రలో పాల్గొన్నారు. సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి ముందు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు.
ఇవి కూడా చదవండి..
ఆ శక్తులు ఇప్పటికీ చురుగ్గానే ఉన్నాయి.. ప్రధాని మోదీ
సోమనాథ్ శౌర్యయాత్రలో ప్రధాని.. కాన్వాయ్ వెంట 108 అశ్వాలు..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి