'ఉపా' చట్టం కింద మరో 23 మంది ఉగ్రవాదుల గుర్తింపు
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:27 PM
ఉగ్రవాదులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. ఉపా చట్టం కింద కొత్తగా 23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ కేంద్ర హోంశాఖ ఓ గెజిట్ను విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం శనివారంనాడు(జులై 4) చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(UAPA) కింద కొత్తగా 23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఈ విషయమై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఓ గెజిట్ను విడుదల చేసింది. ఇందులో జైష్-ఎ-మహమ్మద్(JeM), లష్కర్-ఎ-తొయిబా(LeT)లతో సంబంధమున్న పాకిస్థాన్కు చెందిన పలువురు ఉగ్రవాదుల పేర్లు ఉన్నాయి. వీరిపై ఉగ్రవాద నియామకాలు, చొరబాటు, శిక్షణ, డ్రోన్ల ద్వారా ఆయుధాల సరఫరా, జమ్మూకశ్మీర్లో దాడుల ప్రణాళికలో పాల్గొన్నారనే ఆరోపణలున్నట్టు హోంశాఖ తెలిపింది. తాజా ప్రకటనతో కేంద్రం గుర్తించిన పాక్ ఉగ్రవాదుల సంఖ్య 80కి చేరింది.
హోంశాఖ ప్రకటించిన జాబితాలో లష్కర్ వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్కు అత్యంత సన్నిహితులుగా భావిస్తున్న అబ్దుల్ రవూఫ్, హఫీజ్ ఖలీద్ వలీద్, రానా ఇఫ్తిఖార్ పేర్లు ఉన్నాయి. అలాగే 2016 నాగ్రోటా ఆర్మీ క్యాంప్పై జరిగిన ఉగ్రదాడి, 2018 సుంజ్వాన్ మిలిటరీ స్టేషన్పై దాడులతో సంబంధమున్న మరికొందరూ ఈ జాబితాలో ఉన్నారు. జైష్-ఎ-మహమ్మద్కు చెందిన మసూద్ ఇలియాస్ కశ్మీరీ, మహమ్మద్ ముసద్దిక్, ముఫ్తీ మహమ్మద్ అస్గర్ ఖాన్, హఫీజ్ అబ్దుల్ షకూర్, అబ్దుల్లా జెహాదీ వంటి వారి పేర్లూ ఇందులో ఉన్నాయి. ఇక.. లష్కర్-ఎ-తొయిబాకు చెందిన పలువురు కీలక నిర్వాహకులు సహా అల్ఖైదా, ఐఎస్ఐఎస్తో సంబంధాలున్న మహమ్మద్ షహీద్ ఫైసల్ను కూడా ఉగ్రవాదిగా గుర్తించింది కేంద్రం.
అసలేంటీ 'ఉపా' గుర్తింపు.?
ఉపా చట్టం(UAPA) ప్రకారం.. ఓ వ్యక్తిని ఉగ్రవాదిగా ప్రకటించాక అతడి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, ఆర్థిక లావాదేవీలను నిలిపివేయడం సహా ఆయుధాల సరఫరాను నిషేధించడం వంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంటుంది. అలాగే జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) సదరు వ్యక్తులపై మరింత కఠినంగా విచారణ చర్యలు చేపట్టేందుకూ చట్టపరంగా బలం చేకూరుతుంది. 2019లో 'ఉపా' సవరణకు ముందు ఉగ్ర సంస్థలను మాత్రమే నిషేధిత జాబితాలో చేర్చేందుకు అవకాశముండేది. కానీ సవరణ అనంతరం వ్యక్తులను కూడా నేరుగా ఉగ్రవాదులుగా ప్రకటించే అధికారం కేంద్రానికి ఉంది.
కేంద్రం కొత్తగా ప్రకటించిన ఉగ్రవాదుల జాబితా:
మసూద్ ఇలియాస్ కశ్మీరీ
మహమ్మద్ ముస్సదిక్
ముఫ్తీ ముహమ్మద్ అస్గర్ఖాన్
హఫీజ్ అబ్దుల్ షకూర్
అబ్దుల్లా జెహాదీ
ఫిర్దౌస్ అహ్మద్ భట్
గులాం ఫరీద్
బిలాల్ అహ్మద్ మీర్
అబిద్ ఖుయూమ్లోన్
నజీర్ అహ్మద్ గుజ్జర్
అబ్దుల్ రవూఫ్
అష్ఫాక్ అహ్మద్
హఫీజ్ ఖలీద్ వలీద్
మౌలానా సైఫుల్లా ఖలీద్
మహమ్మద్ యాకూబ్
మోలానా యూసఫ్ తైబీ
ఒవైస్ ఫరూజ్
ఖారీ యాకుబ్ షేక్
రాణా ఇఫ్తికార్
వసీం నూర్ జాట్
మహమ్మద్ షహీద్ ఫైసల్
మౌలానా ఇమ్దాద్ ఉల్లా మక్కీ
హరూన్ రషీద్ గనై
ఇవీ చదవండి:
అస్వస్థతకు గురైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే..
రోజుకు రూ.6-8 లక్షలు.. రామమందిర విరాళాల చోరీ దర్యాప్తులో సంచలన విషయాలు..