అస్వస్థతకు గురైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే..
ABN , Publish Date - Jul 04 , 2026 | 10:59 AM
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇవాళ (శనివారం) అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా స్వల్ప జ్వరం, నీరసం, ఒళ్లునొప్పులతో ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు థానేలోని జూపిటర్ ఆస్పత్రికి షిండేను తరలించారు.
థానే: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇవాళ (శనివారం) అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా స్వల్ప జ్వరం, నీరసం, ఒళ్లునొప్పులతో ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు థానేలోని జూపిటర్ ఆస్పత్రికి షిండేను తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా, కొన్ని రోజులుగా వరుస రాజకీయ కార్యక్రమాలు, విపరీతమైన పనిభారం కారణంగా షిండే ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
శుక్రవారం నాడు మహారాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయనకు జ్వరం వచ్చి తీవ్ర నీరసానికి గురయ్యారు. దీంతో విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ మేరకు నేడు జరగాల్సిన షిండే కార్యక్రమాలన్ని రద్దు చేసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు షిండే ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శివసేన (షిండే వర్గం) నాయకులు తెలిపారు. ఇటీవల మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న కీలక పరిణామాల్లో షిండే చురుకుగా పాల్గొన్న సంగతి తెలిసిందే. ‘ఆపరేషన్ టైగర్’ చేపట్టి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన ఆరుగురు లోక్సభ సభ్యులు సహా ఎమ్మెల్సీ సచిన్ అహిర్ను షిండే తన వర్గంలో చేర్చుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఏక్నాథ్ షిండే పలుమార్లు ఢిల్లీ పర్యటనలు చేయడంతో పాటు వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ నిరంతర రాజకీయ ఒత్తిడి ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. కాగా, ఆరోగ్య సమస్యలతో షిండే జూపిటర్ ఆస్పత్రిలో చేరడం ఇదే తొలిసారి కాదు. 2024 డిసెంబర్లోనూ ఎన్నికల ప్రచారం, రాజకీయ కార్యక్రమాల అనంతరం జ్వరం, నీరసం, గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందారు.
ఈ వార్తలు కూడా చదవండి
మహిళా బిల్లు, పునర్విభజనపై ముందుకే!
బోల్తాపడిన స్కూల్ బస్సు.. 15 మంది విద్యార్థులకు గాయాలు..