ప్రధాని మోదీని సంప్రదించిన తర్వాతే.. రాజీనామా చేశా: ధర్మేంద్ర ప్రధాన్
ABN , Publish Date - Aug 09 , 2026 | 07:42 AM
కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలతో కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రెండు వారాల తర్వాత ఆయన ఈ రాజీనామాపై తొలిసారి స్పందించారు.
భువనేశ్వర్, ఆగస్టు 09: నీట్ ప్రశ్నాపత్రాలు లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనతో చేపట్టింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే తన రాజీనామాపై ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి స్పందించారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన రెండు వారాల తర్వాత ఆయన పెదవి విప్పారు. జన్ జెడ్ను కొంత మంది తప్పు దోవ పట్టించే ప్రయత్నాలు చేశారని విమర్శించారు. అందువల్ల తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరించారు. ప్రధాని మోదీతో సంప్రదించిన తర్వాతే మంత్రి పదవికి రాజీనామా చేశానని తెలిపారు. తనకు కేంద్ర మంత్రి పదవి ముఖ్యం కాదని స్పష్టం చేశారు. భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పారు.
శనివారం ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని జీఎం యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు. జెన్ జెడ్ మన పిల్లలని చెప్పారు. కొంత మంది వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. తనకు వ్యక్తిగత సమస్యలు లేవని తెలిపారు.
ప్రతి ఏటా కనీసం రెండు కోట్ల మంది పిల్లలు జన్మిస్తారని పేర్కొన్నారు. గత పదేళ్లలో 20 కోట్ల మంది పిల్లలు పుట్టారని పేర్కొన్నారు. వారికి ఆశయాలు ఉంటాయని అన్నారు. వారు భారత్ను విశ్వగురువుగా తీర్చుదిద్దుతారని ధర్మేంద్ర ప్రధాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదన్నారు.
నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. దేశవ్యాప్తంగా విద్య వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళన బాట పట్టింది. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేపట్టింది. అలాగే జులై 20వ తేదీన ఛలో పార్లమెంట్ యాత్రకు సీజేపీ పిలుపునిచ్చింది. ఈ యాత్రకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా ఈ యాత్రలో భారీగా యువత పాల్గొంది. ఇది ఉద్రిక్తతలకు కారణమైంది. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జులై 24వ తేదీన కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
4 నెలలుగా వీక్లీ ఆఫ్ ఇవ్వలేదని యువతి ఆత్మహత్య
ఇండక్షన్ స్టవ్లకు వడ్డీ లేని రుణాలు!
For More National News And Telugu News