Share News

బ్రిక్స్ సమ్మిట్: చిదంబరంనకు సొంత పార్టీ నేతల నుంచే కౌంటర్

ABN , Publish Date - Sep 11 , 2026 | 02:56 PM

దేశ రాజధాని ఢిల్లీలో రేపు, ఎల్లుండి జరగనున్న ప్రతిష్ఠాత్మక BRICS సమ్మిట్ ప్రారంభానికి ముందే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల మధ్య వైరుధ్య పూరిత వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి.

బ్రిక్స్ సమ్మిట్: చిదంబరంనకు సొంత పార్టీ నేతల నుంచే కౌంటర్
BRICS Summit 2026: Shashi Tharoor Praises Diplomatic Value After Chidambaram Questions Benefits

ఢిల్లీ, సెప్టెంబర్ 11: ఢిల్లీలో రేపు, ఎల్లుండి (సెప్టెంబర్ 12, 13 తేదీల్లో) జరగనున్న ప్రతిష్ఠాత్మక BRICS సమ్మిట్ 2026 ప్రారంభానికి ముందే కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వైరుధ్య పూరిత వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి. గత కొన్ని సమ్మిట్ల వల్ల భారత్‌కు వచ్చిన ప్రత్యక్ష ప్రయోజనాలపై సీనియర్ నేత పి. చిదంబరం అనుమానాలు వ్యక్తం చేయగా, అదే పార్టీకి చెందిన ఎంపీ శశి థరూర్ మాత్రం BRICS వేదికకు ఉన్న దౌత్య ప్రాముఖ్యాన్ని, భారత్ పాత్రను ప్రశంసించారు.


పి. చిదంబరం వ్యాఖ్యలు

భారత్ ప్రస్తుతం BRICS, SCO, G20, QUAD వంటి పలు బహుళపక్ష కూటమిలలో భాగస్వామిగా ఉందన్న చిదంబరం, గత రెండు మూడు BRICS సమావేశాల ద్వారా భారత్‌కు లభించిన స్పష్టమైన, కనిపించే ప్రయోజనాలు ఏమిటో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఈ సమావేశాల వల్ల దేశానికి వచ్చిన ఫలితాలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.


శశి థరూర్ మద్దతు

చిదంబరం వ్యాఖ్యల అనంతరం మాట్లాడిన శశి థరూర్, ఈ సమ్మిట్‌ను భారత్ దౌత్య శక్తికి నిదర్శనంగా అభివర్ణించారు. ప్రపంచంలో 100కి పైగా ఉన్న గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ ఒక ముఖ్యమైన వేదికను అందిస్తోందని, అందులో అత్యంత క్రియాశీలకమైన 11 దేశాల ప్రతినిధులకు భారత్ నాయకత్వం వహిస్తుండటం గర్వకారణమని థరూర్ పేర్కొన్నారు.

11 సభ్యదేశాలు కలిగిన BRICS కూటమి ప్రపంచ జనాభాలో సగానికి పైగా, అలాగే ప్రపంచ జీడీపీ (GDP) లో 41 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. 2026 BRICS సమ్మిట్‌కు ఆతిథ్యమివ్వడం భారత్‌కు ఎంతో ప్రతిష్టాత్మకమైన విషయమని, దీనికి ప్రపంచస్థాయిలో ఎంతో దౌత్య విలువ ఉందన్నారు.


బీజేపీ ఘాటు స్పందన

చిదంబరం చేసిన విమర్శలపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది. భారత్ ఎదుగుదలను, అభివృద్ధిని జీర్ణించుకోలేని నాయకులుగా వారిని అభివర్ణిస్తూ, దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా మాట్లాడకూడదని హితవు పలికింది.

BRICS 2026 సమ్మిట్ విశేషాలు

'స్థిరత్వం, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం' అనే ఇతివృత్తంతో భారత్ నాలుగోసారి BRICS అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఈ సమ్మిట్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో పాటు 11 సభ్య దేశాలు, 10 భాగస్వామ్య దేశాల అగ్రనేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఢిల్లీకి చేరుకుంటున్నారు.


Also Read:

పోలాల అమావాస్య.. చివరి శ్రావణ శుక్రవారం.. ఏ రాశి వారు ఏ పరిహారం చేయాలంటే?

వినాయకుడి మట్టి విగ్రహాలే ఎందుకు? ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలెందుకు వద్దు?

Updated Date - Sep 11 , 2026 | 03:56 PM