బిహార్లో 25వేల ఓల్టుల విద్యుత్ తీగ చోరీ.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
ABN , Publish Date - Jul 09 , 2026 | 08:22 PM
బిహార్లో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. సుమారు 100 మీటర్ల పొడవైన 25 వేల ఓల్టుల ఓహెచ్ఈ వైర్ను కత్తిరించి ఎత్తుకెళ్లారు దుండగులు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్లో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. గయా-పట్నా ప్రధాన రైల్వే మార్గంలోని తేహ్తా-జెహానాబాద్ స్టేషన్ల మధ్య సుమారు 100 మీటర్ల పొడవుగల 25 వేల ఓల్టుల ఓవర్హెడ్ ఎలక్ట్రిక్(OHE) వైర్ను కత్తిరించి ఎత్తుకెళ్లారు. దీంతో గురువారం తెల్లవారుజామున సుమారు మూడు గంటలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున 3:05 గంటల సమయంలో ఈ చోరీ జరిగింది. దీంతో గయా-పట్నా మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రభావితమయ్యాయి. మరమ్మతులు పూర్తయ్యేవరకు రైళ్లను సింగిల్ లైన్ వర్కింగ్ ద్వారా నడిపించారు. రైల్వే సిబ్బంది ఓహెచ్ఈ వ్యవస్థకు మరమ్మతులు చేపట్టిన అనంతరం ఉదయం 6:26 గంటలకు మార్గాన్ని పునరుద్ధరించారు. ఈ ఘటనకు సంబంధించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) చోరీకి గురైన వైర్ను స్వాధీనం చేసుకుంది. సదరు నిందితులను పట్టుకునేందుకు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే.. ఆ రాష్ట్రంలో రైల్వే విద్యుత్, సిగ్నలింగ్ వ్యవస్థల్లో చోరీలు జరగడం ఇదేమీ తొలిసారి కాదు. ఈ ఏడాది మేలోనూ దానాపూర్లో సిగ్నల్ కేబుళ్లను దొంగిలించడంతో హమ్సఫర్ ఎక్స్ప్రెస్, శ్రమజీవి ఎక్స్ప్రెస్ సహా పదికిపైగా రైళ్లు ఆలస్యంగా నడిచాయి. అంతకుముందు.. 2024 జులైలో ఫతూహా సమీపంలో కూడా సుమారు 39 మీటర్ల ఓహెచ్ఈ తీగను దొంగిలించారు. ఈ ఘటనతో నాడు పట్నా-ఝాజ్హా మార్గంలో 2 గంటలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. 2024 ఏప్రిల్లో జరిగిన ఇదే తరహా ఘటనలోనూ సుమారు 5 గంటలసేపు రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది.
ఇవీ చదవండి:
న్యూజిలాండ్ పర్యటనకు మోదీ.. లక్సన్ కీలక ప్రకటన
మెల్బోర్న్లో మోదీకి ఘన స్వాగతం.. మార్వెల్ స్టేడియం 'హౌస్ఫుల్'