Ritesh Pandey: ప్రశాంత్ కిషోర్ పార్టీకి భోజ్పురి గాయకుడు రితేష్ పాండే రాజీనామా
ABN , Publish Date - Jan 12 , 2026 | 03:37 PM
బాధ్యత కలిగిన భారతీయుడుగా తాను జన్ సురాజ్ పార్టీలో చేరానని, పూర్తి నిజాయితీతో ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొన్నానని, పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ చింతించడం లేదని పాండే తెలిపారు.
పాట్నా: ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) జన్ సురాజ్ (Jan Suraj) పార్టీకి భోజ్పురి గాయకుడు రితేష్ పాండే (Ritesh Pandey) రాజీనామా చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిని చవిచూసిన నెలరోజుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. తన రాజీనామా నిర్ణయాన్ని సోషల్ మీడియాలో పాండే వెల్లడించారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకోవడానికి కారణాన్ని కూడా ఆయన తెలియజేశారు.
బాధ్యత కలిగిన భారతీయుడుగా తాను 'జన్ సురాజ్' పార్టీలో చేరానని, పూర్తి నిజాయితీతో ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొన్నానని, పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ చింతించడం లేదని పాండే తెలిపారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తనపై ప్రజలు ఎంతో ప్రేమ, ఆదరణ, గౌరవం కనబరిచారని, ఈ స్థాయికి తీసుకువచ్చారని అన్నారు. ఎప్పటిలాగే తాను ప్రజాసేవ కొనసాగిస్తానని చెప్పారు. క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ ఆ పని చేయడం చాలా కష్టమని, ఆ కారణంగా తాను జన్ సురాజ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఈరోజు రాజీనామా చేస్తున్నానని ఆ ట్వీట్లో తెలిపారు. తన ఆలోచనలను క్లుప్తంగా తెలియజేసేందుకు ప్రయత్నించానని, ప్రజలు అర్థం చేసుకుంటారనే నమ్మకం తనకుందని అన్నారు.
2025 జూలైలో పార్టీలో చేరిక
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2025 జూలైలో ప్రశాంత్ కిషోర్ సమక్షంలో జన్సురాజ్ పార్టీలో రితేష్ పాండే చేరారు. పార్టీ టిక్కెట్లుపై రోహ్టాస్ జిల్లా కర్గహార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే జేడీయూ అభ్యర్థి విశిష్ట సింగ్ చేతిలో 35,6876 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఇవి కూడా చదవండి..
ట్రంప్, మోదీ మధ్య నిజమైన స్నేహబంధం.. అమెరికా రాయబారి గోర్
పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి