TVK Chief Vijay: కరూర్ తొక్కిసలాట కేసు.. సీబీఐ విచారణకు టీవీకే అధ్యక్షుడు విజయ్
ABN , Publish Date - Jan 12 , 2026 | 11:48 AM
కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి సీబీఐ విచారణ నిమిత్తం.. తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత విజయ్ ఢిల్లీ వెళ్లారు. అక్కడి సీబీఐ కేంద్ర కార్యాలయంలో అధికారులు విజయ్ని విచారించి.. ఆయన వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత విజయ్ ఢిల్లీ వెళ్లారు. కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి సీబీఐ విచారణ నిమిత్తం ఆయన అక్కడకు వెళ్లాల్సి వచ్చింది. సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో ఆయన ఢిల్లీ చేరుకున్నారు. విజయ్తో పాటు ఆయన మేనేజర్ జగదీశ్.. పర్సనల్ బాడీగార్డ్, టీవీకే జాయింట్ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ ఉన్నారు. ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయంలో అధికారులు విజయ్ని విచారించి.. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.
సుప్రీం ఆదేశాలతో సీబీఐకి కేసు
కరూర్ జిల్లా వేలుస్వామిపురంలో 2025 సెప్టెంబర్ 27న టీవీకే పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో జనం తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. 41 మంది ప్రాణాలు కోల్పోయారు. వందమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన సీబీఐ ఇప్పటికే టీవీకే కీలక నేతల స్టేట్మెంట్లను రికార్డు చేసింది. అధ్యక్షుడు విజయ్ ప్రచార వాహనాన్ని సైతం సీజ్ చేసింది. ప్రచార వాహనం డ్రైవర్ కూడా సీబీఐ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.
అయితే.. ఈ ఘటనపై తొలుత తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) విచారణ చేపట్టింది. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసును కోర్టు సీబీఐకి అప్పగించింది. అలాగే దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. సీబీఐ అధికారులు ఇప్పటికే 200 మందికిపైగా ప్రత్యక్ష సాక్షులను విచారించారు. వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు.
ఇవి కూడా చదవండి
టీమిండియాకు మరో షాక్.. సిరీస్ నుంచి స్టార్ ఆల్రౌండర్ ఔట్!
ఓ సైనికా.. ఇంత కష్టం ఎవరికీ రాకూడదు.. బిడ్డ పుట్టడానికి కొన్ని గంటల ముందే..