గెలిచే సీట్లే ఇస్తాం.. కాంగ్రెస్తో పొత్తుపై అఖిలేష్ పార్టీ
ABN , Publish Date - May 22 , 2026 | 07:41 PM
ఉత్తరప్రదేశ్లో 'ఇండియా' బ్లాక్ యథాతథంగా ఉంటుందని, కాంగ్రెస్తో తమ పొత్తు కొనసాగుతుందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ధ్రువీకరించారు. అయితే సీట్ల షేరింగ్ విషయంలో కాంగ్రెస్కు గెలిచే సీట్లే ఇస్తామనే సంకేతాలను ఆ పార్టీ పంపింది.
లక్నో: ఉత్తరప్రదేశ్లో 'ఇండియా' బ్లాక్ యథాతథంగా ఉంటుందని, కాంగ్రెస్తో తమ పొత్తు కొనసాగుతుందని సమాజ్వాదీ పార్టీ (SP) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ధ్రువీకరించారు. అయితే సీట్ల షేరింగ్ విషయంలో కాంగ్రెస్కు గెలిచే సీట్లే ఇస్తామనే సంకేతాలను ఆ పార్టీ పంపింది. ఆ ప్రకారం ఎస్పీతో కాంగ్రెస్ బేరసారాలు జరిగే అవకాశాలు పరిమితంగానే ఉండొచ్చు. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అఖిలేష్ తాజా వ్యాఖ్యలు చేశారు.
అఖిలేష్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, సీట్ల షేరింగ్ అనేది నెంబర్లకు సంబంధించినది కాదని, గెలుపు అవకాశాలపైనే ఉంటుందని తెలిపారు. దీనిపై ఎస్పీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎక్కువ సీట్లు ఆశించేందుకు వీల్లేదని అన్నారు. యూపీలో కాంగ్రెస్ తన బలం గురించి ఎక్కువగా అంచనా వేసుకోరాదని, రాష్ట్రంలో బలమైన సంస్థాగత వ్యవస్థ ఆ పార్టీకి లేదని ఆయన విశ్లేషించారు. షీట్ల షేరింగ్కు విజయం ఒక్కటే ప్రమాణమని, కాంగ్రెస్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి మంచి ఫలితాలు సాధించడమే ప్రధానమని అన్నారు.
మాయావతికి ఇంటికి కాంగ్రెస్ నేతలు..
బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇంటికి ఇటీవల ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఆపాయింట్మెంట్ లేకుండా వెళ్లడం, భద్రతా సిబ్బంది వారిని వెనక్కి పంపడం సంచలనమైంది. మాయావతి ఆరోగ్య పరిస్థితిపై విచారించేందుకు మర్యాదపూర్వకంగానే వెళ్లినట్టు కాంగ్రెస్ నేతలు చెప్పారు. అయితే ఎన్నికల ముందు పొత్తులపై తమకు కూడా తగినన్ని ఆప్షన్లు ఉన్నాయని చెప్పేందుకే కాంగ్రెస్ ఈ ప్రయత్నం చేసి ఉండవచ్చనే ఊహాగానాలకు కూడా వెలువడ్డాయి.
కాగా, ఉత్తరప్రదేలో జరిగిన 2024 లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. బీజేపీ సంఖ్యాబలం గణనీయంగా తగ్గించేందుకు ఈ చర్య ఉపకరించింది మొత్తం 80 లోక్సభ స్థానాల్లో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి 44 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 33 సీట్లు గెలుచుకుంది. తాజా పరిణామాలపై లక్నోకు చెందిన రాజకీయ విశ్లేషకుడు మాట్లాడుతూ, యూపీలోని కొన్ని చోట్ల కాంగ్రెస్ ప్రభావం ఉంటుందని, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే ముస్లిం ఓట్లు చీలిపోయి సమాజీవాదీ గెలుపు అవకాశాలకు గండి పడవచ్చని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రపతి ఎన్నికలు, డీలిమిటేషన్ బిల్లే టార్గెట్.. డీఎంకే 22 మంది ఎంపీలపై బీజేపీ కన్ను!
విజయ్ క్యాబినెట్ విస్తరణ.. ప్రభుత్వంలో కొత్తగా మరో ఇద్దరి చేరిక