‘ప్రక్షాళన’ వివాదంపై మౌనం.. కాంగ్రెస్ నేతల తీరుపై ఖర్గే అసంతృప్తి!
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:43 PM
‘ప్రక్షాళన’ వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంలో సొంత పార్టీ నేతలు తనకు బహిరంగంగా మద్దతు ఇవ్వకపోవడంపై ఆయన మనస్తాపం చెందినట్లు సమాచారం.
ఢిల్లీ, ఆగస్టు 20: ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో తన ప్రసంగం అనంతరం చోటుచేసుకున్న ‘ప్రక్షాళన’ వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంలో సొంత పార్టీ నేతలు తనకు బహిరంగంగా మద్దతు ఇవ్వకపోవడంపై ఆయన మనస్తాపం చెందినట్లు సమాచారం. బుధవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఖర్గే ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హల్ద్వానీలో తాను ప్రసంగించిన వేదికను అనంతరం ‘శుద్ధి’ చేశారనే అంశంపై ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నాయి.
ఆగస్టు 8న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ఉత్తరాఖండ్లోని హల్ద్వానీకి ఖర్గే వెళ్లారు. అక్కడ ఆయన ప్రసంగించిన వేదికను కొందరు ‘ప్రక్షాళన’ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ఖర్గే గతంలో బహిరంగంగానే స్పందించారు. తన ప్రసంగం అనంతరం అదే ప్రదేశంలో శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించడాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటన కుల వివక్షకు సంబంధించినదిగా పేర్కొంటూ బీజేపీపై విమర్శలు చేశారు. అయితే ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ స్పష్టం చేసింది.
ఈ వివాదంపై పార్టీకి చెందిన పలువురు నాయకులు తనకు మద్దతుగా స్పందించకపోవడం ఖర్గేను బాధించిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తనకు ఇలాంటి సందర్భంలో నేతల నుంచి మద్దతు ఉంటుందని ఆయన ఆశించినట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. సొంత పార్టీ నేతల మౌనం తనను నిరాశకు గురిచేసిందని ఖర్గే చెప్పినట్లు సమాచారం. పార్టీ అంతర్గతంగా ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆపరేషన్ తర్వాత మహిళ కడుపులో గ్లౌజులు, పేపర్ వైప్స్.. మహారాష్ట్రలో ...