6 నెలలుగా సాగుతున్న ఇరాన్ ఘర్షణ.. ట్రంప్ తీవ్ర ఆగ్రహం!
ABN , Publish Date - Jul 31 , 2026 | 10:39 AM
ఇరాన్తో సైనిక ఘర్షణలు 6వ నెలకు చేరుకున్నప్పటికీ ముగింపునకు రాకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ఉన్నత సలహాదారుల బృందంలో తీవ్ర భేదాభిప్రాయాలే దీనికి కారణమని అంతర్జాతీయ మీడియా అంటోంది.
వాషింగ్టన్ డీసీ, జులై 31: ఇరాన్తో సైనిక ఘర్షణలు 6వ నెలకు చేరుకున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్నారని అంతర్జాతీయ మీడియా అంటోంది. యుద్ధాన్ని ముగించి ఇరాన్ను చర్చలకు తీసుకురావడంపై ట్రంప్ ముఖ్య సలహాదారుల మధ్య తీవ్ర వ్యూహాత్మక భేదాభిప్రాయాలు నెలకొనడమే ఇందుకు కారణమని చెబుతున్నాయి.
ఎన్బీసీ న్యూస్ కథనం ప్రకారం, ట్రంప్ ఇరాన్ను చాలా త్వరగానే లొంగదీసుకుని ఒప్పందానికి ఒప్పించవచ్చని భావించారు. కానీ ఈ యుద్ధం నెలల తరబడి కొనసాగుతుండటం ఆయనను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. 'ఇరాన్ను ఒప్పందానికి ఒప్పించడం ఇంత కష్టమని ట్రంప్ ఊహించలేదు. యుద్ధాన్ని ముగించే దిశగా ఎలాంటి స్పష్టమైన సుదీర్ఘ వ్యూహం యంత్రాంగం వద్ద లేదు' అని ట్రంప్ అత్యున్నత సహచరుడు వ్యాఖ్యానించినట్టుగా సదరు కథనాలు పేర్కొంటున్నాయి. ఈ యుద్ధాన్ని చాలా కాలం పాటు పొడిగించాలనే ఆలోచన ట్రంప్కు ముందే లేదని, అయితే ప్రస్తుతం పరిస్థితి ఆయన నియంత్రణ దాటిపోయిందని సదరు వర్గాలు వెల్లడించాయి.
'ఇన్ని నెలలు గడిచినా మా యంత్రాంగంలో ఐక్యత లేదు. మనం అనేక సాంకేతిక విజయాలు సాధించినప్పటికీ, స్పష్టమైన విధానపరమైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల వ్యూహాత్మక ఓటమిని ఎదుర్కొనే ప్రమాదం ఉందో లేదో తెలియని అయోమయంలో ఉన్నాం' అని కూడా పేరు చెప్పడానికి ఇష్టపడని మరొక అమెరికా అధికారి తెలిపారని ఆ కథనంలో పేర్కొన్నారు. అంతేకాదు, గత వారం జరిగిన జాతీయ భద్రతా సమావేశంలో ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి లోనై, అధికారులపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారని కూడా ఎన్బీసీ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News