భారత్ 'అద్భుతమైన పురోగతిని' సాధిస్తోంది: రష్యా
ABN , Publish Date - Aug 15 , 2026 | 05:41 PM
భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాలలో భారత్ 'అద్భుతమైన పురోగతిని' సాధిస్తోందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో విశేషమైన ప్రాముఖ్యాన్ని, గౌరవాన్ని సొంతం చేసుకుందన్నారు.
ఆంధ్రజ్యోతి, ఆగస్టు 15: భారత దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతదేశపు 'అద్భుతమైన పురోగతి'ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం సాధిస్తున్న 'అద్భుతమైన పురోగతి'ని, అంతర్జాతీయ వేదికపై భారత్కు ఉన్న ప్రాబల్యాన్ని ఆయన కొనియాడారు. ఈ మేరకు పుతిన్.. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక టెలిగ్రామ్ ఛానెల్లో పోస్ట్ చేశారు.

'మీ దేశం ఆర్థిక, సామాజిక, శాస్త్రీయ, సాంకేతిక రంగాలలో అద్భుతమైన పురోగతిని సాధిస్తోంది. అంతేకాదు, అంతర్జాతీయ వేదికపై సముచితమైన, గణనీయమైన ప్రాబల్యాన్ని కలిగి ఉంది.' అని పుతిన్ భారత రాష్ట్రపతి, ప్రధానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'రష్యా-భారత సంబంధాలు ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్య స్ఫూర్తితో విజయవంతంగా అభివృద్ధి చెందుతున్నాయి. మాస్కో, న్యూఢిల్లీ విస్తృత శ్రేణి రంగాలలో ఫలవంతమైన సహకారంలో నిమగ్నమై ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి, షాంఘై సహకార సంస్థ, బ్రిక్స్, ఇతర బహుపాక్షిక సంస్థల విషయంలో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటున్నాయి' అని పుతిన్ అన్నారు. ఇరు దేశాలు తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని పుతిన్ విశ్వాసం వ్యక్తం చేశారు. 'మన మిత్ర దేశాల ప్రజల ప్రయోజనం కోసం, అంతర్జాతీయ భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించే ఆసక్తితో, మన ఉమ్మడి ప్రయత్నాల ద్వారా నిర్మాణాత్మక రష్యా-భారత్ భాగస్వామ్యాన్ని సమగ్రంగా బలోపేతం చేస్తామని నేను విశ్వసిస్తున్నాను' అని పుతిన్ తన పోస్ట్లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...
అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు
Read Latest AP News And Telugu News