Share News

సీబీఎస్ఈ విద్యా విధానంలో కీలక మార్పు.. 6వ తరగతి నుంచే మూడో భాష!

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:27 PM

సీబీఎస్ఈలో ఇకపై ఆరో తరగతి నుంచి మూడో భాష ఎంపిక విధానం అమలు కానుంది. ఎన్ఈపీ-2020 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిబంధనను తప్పనిసరి చేసింది.

సీబీఎస్ఈ విద్యా విధానంలో కీలక మార్పు.. 6వ తరగతి నుంచే మూడో భాష!
CBSE To Introduce Third Language Option In Class 6

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో త్రిభాషా సూత్రం మరోసారి తెరపైకి వచ్చింది. ఇకపై 6వ తరగతి నుంచే మూడో భాష ఎంపికను ప్రవేశపెట్టనుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడుకేషన్(సీబీఎస్ఈ). జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)-2020 మార్గదర్శకాలకు అనుగుణంగా దీనిని తప్పనిసరి చేసింది. ఇది అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తించనుంది.


సవరించిన నిబంధనల ప్రకారం.. 6వ తరగతి విద్యార్థులు ఇకపై మూడు భాషలు నేర్చుకోనున్నారు. వీటిలో కనీసం రెండు భారతీయ భాషలు ఉంటాయి. ఇంగ్లీష్ ను ప్రాంతీయ భాషగా అందిస్తున్న ప్రాంతాల్లో దానిని విదేశీ భాషగా పరిగణిస్తారు. అంటే ఇంగ్లీష్ బోధించే ప్రాంతాల్లో.. విద్యార్థులు రెండు దేశీయ భాషలను ఎంచుకోవలసి ఉంటుంది. ఒకవేళ విద్యార్థి ఫ్రెంచ్ లేదా స్పానిష్ లాంటి విదేశీ భాషను ఎన్నుకున్నట్టయితే ఈ నియమాల్లో మార్పులుండవు. మొత్తంగా మూడు భాషల కలయికలో 2 దేశీయ భాషలు తప్పనిసరన్న మాట.


ఎన్ఈపీ-2020 రూపొందించిన ఈ విధానం ప్రకారం.. స్థానిక అంశాలు, ప్రాధాన్యాలను దృష్టిలో ఉంచుకుని ఏయే భాషలను అందించాలో నిర్ణయించుకునే వెసులుబాటును రాష్ట్రాలు, ప్రాంతాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కనీసం 5వ తరగతి వరకు.. ముఖ్యంగా ఎనిమిది లేదా ఆపై తరగతుల వారికి మాతృభాష, ఇంటి భాష లేదా ప్రాంతీయ భాషను బోధనా మాధ్యమంగా చేర్చాలని ఈ విధానం సిఫార్సు చేస్తుంది. 2023 జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం ప్రకారం.. 9, 10 తరగతుల వరకు విద్యార్థులు మూడు భాషలపై పట్టు సాధించాలని ఎన్ఈపీ సూచించింది.


త్రిభాషా సూత్రం - నేపథ్యం

త్రిభాషా సూత్రాన్ని మొదటి జాతీయ విద్యా విధానం 1968లో ప్రవేశపెట్టారు. ఆ తరవాత జాతీయ విద్యా విధానం 1986, ఎన్ఈపీ 2020లో ప్రస్తావించారు. ఈ చట్రం చట్టానికి కట్టుబడి ఉండదని, రాష్ట్రాలకు మార్గదర్శకంగా పనిచేస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఎవరిపైనా ఏ భాషనూ బలవంతంగా రుద్దబోమని పేర్కొంది. జాతీయ సమైక్యతను సమతుల్యం చేస్తూ బహు భాషావాదాన్ని ప్రోత్సహించడమే తమ లక్ష్యమంది.

1968లో భారతదేశంలో పాఠశాల విద్యాస్థాయిలో విద్యార్థులు వివిధ భాషలను నేర్చుకోవాలనే ఉద్ధేశంతో త్రిభాషా సూత్రాన్ని రూపొందించారు. దీనిని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అనంతరం.. నేషనల్ పాలసీ రిజల్యూషన్ 1968 ద్వారా అమలులోకి తెచ్చారు. దీని ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాలలో మూడు భాషలను విధిగా ఉపయోగించాలి. హిందీ మాట్లాడే రాష్ట్రాలలో హిందీ, ఆంగ్లం, ఆధునిక భారతీయ భాష(ప్రధానంగా దక్షిణ భారతదేశ భాష); హిందీ మాట్లాడని రాష్ట్రాలలో హిందీ, ఆంగ్లం, ఏదైనా ప్రాంతీయ భాష ఉండాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రాల ప్రజలు చేసిన నిరసనల ఫలితంగా త్రిభాషా సూత్రాన్ని ఈ విధంగా రూపొందించారు. అయితే.. ప్రస్తుతం తమిళనాడులో ఈ సూత్రాన్ని అనుసరించడం లేదు.


ఇవీ చదవండి:

అదిగో ఎండ..కొనేయ్‌ కుండ..!

ఢిల్లీలో జేఎన్ యూ విద్యార్థుల నిరసన హింసాత్మకం.. 14 మంది అరెస్ట్

ఢిల్లీ మద్యం పాలసీ కేసు.. కేజ్రీవాల్‌కు భారీ ఊరట..

Updated Date - Feb 27 , 2026 | 04:27 PM