ఘనంగా శాకంబరీ ఉత్సవాలు.. వివిధ రకాల పండ్లు, కూరగాయలతో దుర్గమ్మ దర్శనం
ABN , Publish Date - Jul 27 , 2026 | 11:01 AM
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో శాకంబరీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు.
విజయవాడ, జులై 27: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో శాకంబరీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. మూలవిరాట్తో పాటు ఆలయ ప్రాంగణమంతా కూరగాయలతో అలకరించారు. ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా శాకంబరీ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సకాలంలో వర్షాలు పడి, పాడిపంటలు పండి, దేశం సస్యశ్యామలంగా ఉండేందుకు ప్రతి ఏడాది శాకంబరీ ఉత్సవాలను నిర్వహిస్తారు.
మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో శాకంబరీ దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తారు. ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ సన్నిధికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జై దుర్గా.. జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. అమ్మవారి ఒంటి మీద నుంచి తీసిన శాఖాలతో కదంబ ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు పంపిణీ చేస్తారు. కదంబ ప్రసాదాన్ని స్వీకరిస్తే అనారోగ్యాలు పోయి ఆరోగ్యంగా ఉంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆలయానికి పెద్దఎత్తున భక్తులు తరలివస్తుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇవి కూడా చదవండి...
విదేశీ యువతిపై అసభ్య ప్రవర్తన.. సాఫ్ట్వేర్ ఇంజినీర్పై కేసు
ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి.. సీఎం, డిప్యూటీ సీఎం నివాళులు
Read Latest AP News And Telugu News