సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము..!
ABN , Publish Date - Mar 27 , 2026 | 09:31 AM
భక్తరామదాసును తానీషా నవాబు కారాగారంలో బంధించిన సమయంలో ఆలపించిన కొన్ని కీర్తనల్లో ఈ నగల ప్రసక్తి ఉండటం విశేషం.
భక్తరామదాసు చేయించిన ఆభరణాలు అజరామరం
భద్రాద్రి రామయ్యకు 70 కిలోల స్వర్ణం,1067 కిలోల వెండి
నేటికీ భక్తరామదాసు చేయించిన ఆభరణాలతోనే కల్యాణం
భద్రాచలం: భక్తరామదాసును తానీషా నవాబు కారాగారంలో బంధించిన సమయంలో ఆలపించిన కొన్ని కీర్తనల్లో ఈ నగల ప్రసక్తి ఉండటం విశేషం. ఇక్ష్వాకుల తిలక ఇకనైన పలకవే రామచంద్రా.. అనే కీర్తనలో సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా ... ఆ పతకమునకు పట్టే పదివేల వరహాలు రామచంద్రా అంటూ ఆక్రోశిస్తూ కలికితురాయి నీకు పొలుపుగా చేయిస్తి, రామచంద్రా.. ఎవడబ్బ సొమ్మని నీవు కులుకుతూ తిరిగేవు రామచంద్రా అని తిరిగి తన తప్పులు తెలుసుకున్న భక్తరామదాసు అబ్బ తిట్టితినని అయాసపడవద్దు రామచంద్రా ఈ దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్యా రామచంద్రా... అని వాపోయారు.
భద్రాద్రి రామునికి రామదాసు చేయించిన ఆభరణాలనే నేటికీ ధరింపజేస్తారు. రామదాసును చెరసాల నుంచి విడిపించడానికి తానీషా నవాబుకు రామలక్ష్మణులు సమర్పించారన్న బంగారు రామమాడ నాణాలు కొన్ని ఈనాటికీ భద్రాద్రి ఆలయంలోనే ఉన్నాయి. రామటెంకిగా పిలిచే ఈ నాణెంపై దేవనాగరి లిపి ముద్రించి ఉంది. కల్యాణం రోజున రాముల వారు ధరించే రవ్వల వైరము డి, మఽధ్యలో గల నీలపురాయి మద్రాసుకు చెందిన వేశ్యశ్రీరామునికి సమర్పించిందని కథనం. తూము నర్సింహదాసు స్థిరీకరించిన మహారాజ సేవోత్సవం సందర్భంగా ఆయన రాసిన ఒక కీర్తన పూజ సేయరే స్వామికి బంగారు పూలతో పూజ సేయరే స్వామికి అన్న దానికి అన్వయిస్తూ చినజీయర్స్వామి 108 బంగారు పుష్పాలను సమర్పించారు.
సీతమ్మ వారికి, రాముల వారికి కంకణాల అలంకరణకు సయ్యద్ మీరా అనే ముస్లిం భక్తుడు బంగారు తోడాలు ఇచ్చారు. భక్తరామదాసు 30 తులాలతో చేయించిన మూడు బంగారు మంగళ సూత్రాలతోనే సీతమ్మ వారికి సూత్రధారణ జరుగుతుంది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామికి ప్రస్తుతం సుమారు 70.461 కేజీల బంగారం, 1067.353 కేజీల వెండి ఉంది. ఇందులో 9 కేజీల 865 గ్రాముల 432 మిల్లీ గ్రాముల బంగారం గోల్డ్బాండ్ రూపంలో ఉంది. కాగా స్వామివారి కల్యాణ సమయం, ముఖ్య ఉత్సవాల సమయంలో భక్తరామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న చేయించిన బంగారు ఆభరణాలనే వినియోగించడం జరుగుతుంది.
వజ్రాలు, పొదిగి, విలువైన పచ్చలు వేలాడగట్టిన సుందరమైన పచ్చల పతకం, కెంపు లు పొదిగి ముత్యాలతో వేలాడే చింతాకు పతకం, కిరీటంలో అలరించే వజ్రాలు పొదిగిన కలికితురాయి తదితర విలువైన ఆభరణాలు భక్తరామదాసు చేయించారు. ఆ తర్వాత కూడా చాలా మంది భక్తులు స్వామికి ఎన్నెన్నో ఆభరణాలు, అలంకారాలు చేయించారు. విశాఖపట్టణానికి చెందిన పద్మజారెడ్డి స్వామి ఊంజల్ సేవకు బంగారు ఊయలను బహుకరించారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంకు చెందిన రామస్వామి అనే భక్తుడు బంగారు గొడుగును రామపాదుకలను సమర్పించారు.
బీసీసీఐ మాజీ చైర్మన్, ఇండియా సిమెంట్స్ ఎండీ శ్రీనివాసన్ భద్రాద్రి రామాలయంలో రూ.40 లక్షల ఖర్చుతో రామాలయంలో బంగారు వాకిలి తయారు చేయించారు. బెంగుళూరుకు చెందిన జేవీ రంగరాజు శ్రీదేవి దంపతులు 12.8 కిలోల స్వర్ణ కవచంను మూలవరులకు చేయించారు. దీని విలువ సుమారు రూ.3.85 కోట్లు ఉంటుంది. 2024 ఫిబ్రవరిలో భ ద్రా ద్రి దేవస్థానం అధికారులు 103 కేజీలతో అంతరాలయ ప్రవేశ ద్వారంకు వెండి వాకిలి ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నేడు భద్రాద్రి రామయ్యకు కల్యాణం.. రేపు మహాపట్టాభిషేకం..
గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News