1975 నాటి చీకటి అధ్యాయం భారత్లో మళ్లీ రానుందా?
ABN , Publish Date - May 14 , 2026 | 03:27 PM
మన దేశం ఆర్థిక ఎమర్జెన్సీ వైపు వెళ్తోందా? అనే భయాలు ఇప్పుడు సగటు భారతీయుణ్ని వెంటాడుతున్నాయి. రష్యా చమురుపై ట్రంప్ తాజా మినహాయింపుల గడువు సమీపిస్తుండటమే దీనికి కారణం. ఈ అంశంపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఆంధ్రజ్యోతి, మే 14: దేశం ఆర్థిక ఎమర్జెన్సీ వైపు వెళ్తోందా.. రష్యా చమురుపై ట్రంప్ ఆంక్షల ప్రభావం ఎలా ఉండబోతోంది.? అనే అనుమానాలు ఇప్పుడు దేశ ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. 1975 జూన్ 25న ఇందిరాగాంధీ విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి(National Emergency) భారతదేశ చరిత్రలో ఓ చీకటి అధ్యాయం. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత.. ఇప్పుడు దేశం మళ్లీ అలాంటి పరిస్థితుల్లో ఉండబోతుందా? ముఖ్యంగా నరేంద్ర మోదీ హయాంలో దేశం 'ఆర్థిక ఎమర్జెన్సీ' (Economic Emergency) దిశగా అడుగులు వేస్తోందా? అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జోరందుకుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం రష్యా ముడి చమురు దిగుమతులపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయలేదు. అయితే, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, చమురు కొరతను దృష్టిలో ఉంచుకుని కొన్ని తాత్కాలిక మినహాయింపులు(Waivers) మాత్రమే ఇచ్చింది. ఈ గడువు ఈ నెల 16తో ముగియనుంది.
ఇక.. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతల వల్ల హోర్ముజ్ జలసంధి రవాణాకు అత్యంత ఇబ్బందికరంగా మారింది. ఇరాన్ ఈ మార్గం గుండా వెళ్లే నౌకలపై నియంత్రణ సాధించి, ఒక్కో నౌకకు దాదాపు 1 మిలియన్ డాలర్ల పైగా టోల్ వసూలు చేస్తోందని నివేదికల ద్వారా తెలుస్తోంది. భారత నౌకలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. అయితే.. ఇరాన్ రాయబారి భారత్తో తమకున్న ప్రత్యేక సంబంధాల దృష్ట్యా భారత నౌకల నుంచి టోల్ వసూలు చేయడం లేదని అధికారికంగా ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో భద్రతా రిస్క్ కారణంగా రవాణా ఖర్చులు బాగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ఈ అంశంపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి తన 'ఎక్స్' ఖాతా వేదికగా స్పందించారు.
అయితే.. నిపుణుల విశ్లేషణ ప్రకారం భారత్ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనే స్థితిలో లేదని సమాచారం. భారత జీడీపీ వృద్ధి రేటు ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండటం సానుకూలాంశమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఇటీవల చేసిన 'ఇంధన పొదుపు' పిలుపును కొందరు ఎమర్జెన్సీకి సంకేతంగా చూస్తున్నప్పటికీ.. అది కేవలం ముందు జాగ్రత్త చర్య అని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి: