‘జలహారతి’ అమలులో ముందుండాలి
ABN , Publish Date - May 01 , 2026 | 11:37 PM
జలహారతి కార్యక్రమం అమలులో రాష్ట్రస్థాయిలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కురుపాం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు
కురుపాం,మే1(ఆంధ్రజ్యోతి): జలహారతి కార్యక్రమం అమలులో రాష్ట్రస్థాయిలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కురుపాం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ‘ చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ పనుల్లో జిల్లా ఇప్పటికే ముందంజలో ఉంది. చెరువులన్నింటిలో నీరు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలి. గ్రౌండ్ వాటర్ లెవల్స్ మరింత పెరిగేలా పనులు నిర్వహించాలి. జలధార- జలహారతి కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించి.. అత్యుత్తమ ఫలితాలు సాధించాలి. ఉపాధి హామీలో వేతనదారుల హాజరు, పనుల తీరు విషయంలో జిల్లా ఇప్పటికే మంచి ఫలితాలు సాధిస్తోంది. కొన్ని మండలాల్లో మాత్రమే అవగాహన లోపం లేదా సిబ్బంది నిర్లక్ష్యం కనిసిస్తోంది. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, టెక్నికల్ సిబ్బంది, ఈసీలు సమన్వయంతో పనిచేస్తే 100 శాతం లేబర్ రిపోర్టింగ్ సాధ్యమవుతుంది. గ్రామాల్లో ఉన్న ప్రతిఒక్కరికీ పని కల్పించే పరిస్థితి జిల్లాలో ఉంది. కార్మికులందరూ ఈ-శ్రమ్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఈ నమోదు పూర్తిగా ఉచితం. ప్రమాదం, వైకల్యం లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవించిన సందర్భాల్లో కార్మిక కుటుంబాలకు బీమా రక్షణ లభిస్తుంది. ’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
అక్షరాస్యత సాధనలో జిల్లా ఆదర్శం
అక్షరాస్యత సాధనలో జిల్లా ఆదర్శంగా నిలిచిందని కలెక్టర్ తెలిపారు. ‘ఉల్లాస్... అక్షరాంధ్ర’ కార్యక్రమంలో మన్యం అద్భుత ఫలితాలు సాధించినట్లు వెల్లడించారు. జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన డీఆర్డీఏ, డ్వామా, మెప్మా అధికారులు, వలంటీర్లను అభినందించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో అక్షరాస్యత కేవలం 50.38 శాతం మాత్రమే ఉందన్నారు. వివిధ కార్య క్రమాల ద్వారా 2025 నాటికి 75.74 శాతానికి చేరుకుందన్నారు. గతేడాది అక్షరాస్యత శాతాన్ని 83.87 శాతానికి పెంచగలిగామని తెలిపారు.