Share News

Develop with ‘Employment’ funds ‘ఉపాధి’ నిధులతో అభివృద్ధి చేయండి

ABN , Publish Date - May 08 , 2026 | 12:32 AM

Develop with ‘Employment’ funds చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పాటు ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులను వినియోగించాలని సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. అమరావతిలోని సచివాలయంలో గురు వారం జరిగిన ఏడో విడత కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ జిల్లాల వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను తొలుత వివరించారు.

Develop with ‘Employment’ funds ‘ఉపాధి’ నిధులతో అభివృద్ధి చేయండి
కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి

‘ఉపాధి’ నిధులతో అభివృద్ధి చేయండి

- కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డితో

సీఎం చంద్రబాబు

- కాన్ఫరెన్స్‌ విరామ సమయంలో కొద్దిసేపు చర్చ

- రూ.22 కోట్లు సరిపోవడం లేదన్న కలెక్టర్‌

విజయనగరం/ కలెక్టరేట్‌ మే 7(ఆంధ్రజ్యోతి):

చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పాటు ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులను వినియోగించాలని సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. అమరావతిలోని సచివాలయంలో గురు వారం జరిగిన ఏడో విడత కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ జిల్లాల వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను తొలుత వివరించారు. సదస్సు విరామ సమయంలో జిల్లా కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డితో కొద్దిసేపు మాట్లాడారు. జిల్లాలో చాలా చెరువులకు గండ్లు పడ్డాయని, కొన్నిచోట్ల చెక్‌డ్యాంలు, మదుములు దెబ్బతిన్నాయని, వాటి అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.22 కోట్లు సరిపోవడం లేదని కలెక్టర్‌ వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ రాబోయే ఖరీఫ్‌లో సాగునీటి విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదని, చెరువుల అభివృద్ధికి ఉపాధి హామీ మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులను వినియోగించా లని సూచించారు. అదే విధంగా జిల్లాలో పరిశ్రమల స్థాపన, వాటికి సంబంధించిన మౌలిక వసతుల ఏర్పాటు గురించి కలెక్టర్‌తో చర్చించారు. అంతకు ముందు కాన్ఫరెన్స్‌లో భోగాపురం విమానాశ్రయం నిర్మాణం గురించి సీఎం ప్రస్తావించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు జూలై నాటికి పూర్తి కానుందని తెలిపారు. పాలనలో కలెక్టర్ల పాత్ర కీలకమని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి నిలిచిపోయిందని, అభివృద్ధి లేనిదే సంపదలేదని.. సంపద లేకుంటే సంక్షేమం ఎలా అని ప్రశ్నించారు. ప్రధానంగా అభివృద్ధిపై కలెక్టర్లు దృష్టిసారించాలని సూచించారు.

ఫ స్వర్ణాంధ్ర-2047 విజన్‌ డాక్యుమెంట్‌పైనా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 2047 నాటికి ఏపీని అగ్రగామిగా నిలబెట్టే క్రమంలో పేదరిక నిర్మూలన, నీటిభద్రత, వ్యవసాయ సాంకేతికత, డీప్‌-టెక్‌ రంగాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలవారీగా సాధించిన జీఎస్‌డీపీ వృద్ధిపై ఆర్థిక శాఖ ప్రత్యేక పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. ఈ విషయంలో విజయనగరం జిల్లాతో పాటు విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలు సాధించిన ప్రగతి గురించి కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డితో పాటు ఆ జిల్లాల కలెక్టర్లు వివరించారు. కాగా శుక్రవారం సైతం సదస్సు కొనసాగనుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలతో పాటు సూపర్‌ సిక్స్‌ పథకాలపై చర్చించనున్నారు.

Updated Date - May 08 , 2026 | 12:32 AM