డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు స్పీకర్, హోం మంత్రి ఘన నివాళి
ABN , Publish Date - Apr 14 , 2026 | 11:41 AM
అనకాపల్లి జిల్లా నాతవరంలో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి అనిత పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు నేతలు.
అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 14: నాతవరంలో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు(AP Speaker Ayyanna Patrudu), హోం మంత్రి అనిత(Home Minister Anitha) పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాతవరం, గొలుగొండ, కేడీ పేట ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాలను నేతలు ప్రారంభించారు. పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన పథకం కింద ఎస్సీ, ఎస్టీ సోలరైజేషన్ ప్రక్రియను స్పీకర్, హోంమంత్రి ప్రారంభించారు. హోం మంత్రిగా ఎలా ఉండాలో అనిత నిరూపించారని, అసెంబ్లీలో కూడా ఆమె ప్రసంగాలు అందరికీ అర్థమయ్యేలా స్పష్టంగా ఉంటాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కొనియాడారు.
అయ్యన్నపాత్రుడు నా రాజకీయ గురువు: హోం మంత్రి
అయ్యన్నపాత్రుడు తన రాజకీయ గురువని, ఆయన ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయికి చేరానని హోం మంత్రి వంగలపూడి అనిత భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. సభాపతి అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో రాజధాని అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించడం చారిత్రాత్మకమని తెలిపారు. గత ప్రభుత్వంలో దుర్వినియోగమైన ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం.. దళితవాడల అభివృద్ధికి వినియోగిస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అమాయక గిరిజనులు ఈ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. నేరగాళ్లు, రౌడీ మూకలపై పీడీ(PD) యాక్ట్ ప్రయోగిస్తామని, ఎన్డీపీఎస్(NDPS) చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే ఆరు నెలల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో గంజాయి రవాణా, రౌడీయిజాన్ని పూర్తిగా అణచివేస్తామని హోం మంత్రి అనిత హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
తమ్ముడిని నిద్రపుచ్చి ఉయ్యాల ఊగుతున్న చిన్నారి.. అంతలోనే
జువ్వలదిన్నెపై వైసీపీ నీచ రాజకీయం: మంత్రి అనగాని సత్యప్రసాద్
Read Latest AP News And Telugu News