Passenger Train: ‘ప్యాసింజర్’ సమస్యలు తీరేనా..?
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:36 PM
అప్పటివరకు సాఫీగా సాగుతున్న ప్రయాణానికి కోవిడ్ అడ్డుపడింది. దాని కారణంగా రద్దు చేసిన రైలును నేటికీ పునరుద్దరించలేదు. దీంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిా ఉన్నాయి.
- ఆరేళ్ల నుంచి ప్యాసింజరు రైళ్లకు కలగని మోక్షం
- ఎగ్మోర్, విజయవాడ, గుల్బర్గ ప్యాసింజర్లకు మంగళం
- బెంగళూరు డెము రైలును గుంతకల్లు వరకూ తేవాలని డిమాండ్
గుంతకల్లు(అనంతపురం): గుంతకల్లు(Guntakal) నుంచి బెంగళూరు, చెన్నై, విజయవాడ డే ప్యాసింజరు రైళ్లు పునరుద్ధరించని కారణంగా జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఐదేళ్ల కిందట గుంతకల్లు-ఎగ్మోర్ (చెన్నై), యశ్వంతపూర్-విజయవాడ (56503/04), గుంతకల్లు-గుల్బర్గా ప్యాసింజరు రైళ్లు నడిచేవి. కరోనా సీజన్ పూర్తయిన తర్వాత పలు ప్యాసింజరు, ఎక్స్ప్రెస్ రైళ్లను పునరుద్ధరించినా ఈ ప్యాసింజరు రైళ్లను పట్టాలెక్కించలేదు. గుంతకల్లు-తిరుపతి, గుంతకల్లు-కాచిగూడ, గుంతకల్లు-రాయచూరు ప్యాసింజర్లను మాత్రమే పునరుద్ధరించారు. దీంతో బెంగళూరు, విజయవాడ, చెన్నై వెళ్లే జిల్లా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గుంతకల్లు నుంచి బెంగళూరు మధ్య ప్యాసింజరును నడపాలంటూ స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నా రైల్వే శాఖ పెడచెవిన పెడుతూ వస్తోంది.

డెము రైలును గుంతకల్లుకు పొడిగించాలి
గుంతకల్లు నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంలో నడపిన యశ్వంతపూర్-విజయవాడ ప్యాసింజరు రైలును పునరుద్ధరించాలని, కనీసం బెంగళూరు-అనంతపురం డెము రైలును గుంతకల్లు వరకూ పొడిగించాలని స్థానికులు కోరుతున్నారు. బెంగళూరు-ధర్మవరం-బెంగళూరు (66559/60) మెము (మెయిన్లైన్ ఎలెక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైలును గత జూన్ 4న అనంతపురం వరకూ పొడిగించారు. డివిజన్లోకి వచ్చే ఈ రైలును డివిజన్ కేంద్రం అయిన గుంతకల్లు వరకూ పొడిగిస్తే స్థానిక ప్రజల డిమాండ్ నెరవేరుతుంది. అలాగే గతంలో టాటానగర్-యశ్వంతపూర్-టాటానగర్ (18111/12) ఎక్స్ప్రెస్ గుంతకల్లు మీదుగా వెళ్లేది. కరోనా తర్వాత ఈ రైలును గుంతకల్లు స్టేషన్ను స్కిప్ చేసి బైపాస్ మీదుగా బళ్లారి-ఆదోని స్టేషన్ల మీదుగా మళ్లించారు. ఈ రైలును కూడా గుంతకల్లులో ఆపే ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
గుంతకల్లుకు పొడిగించాలి
బెంగళూరుకు తక్కువ చార్జీతో ప్రయాణించే అవకాశం లేకుండా చేశారు. గతంలో ఉన్న యశ్వంతపూర్-విజయవాడ ప్యాసింజరు రైలును పునరుద్ధరించాలి. లేదా అనంతపురం వరకూ పొడిగించిన మెము రైలును గుంతకల్లు వరకూ తీసుకురావాలి. ఈ రైలు గుంతకల్లు డివిజన్ కేంద్రం నుంచి ప్రారంభిస్తే జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
-సంపత్ కుమార్, గుంతకల్లు
ఉపయోగపడేలా చేయాలి
బెంగళూరు-అనంతపురం మెము రైలు మధ్యాహ్నం 2 గంటలకల్లా అనంతపురం చేరుకున్న తర్వాత రెండుంపావు గంటలసేపు అక్కడే ఉంచుతున్నారు. ఆ సమయంలో ఈ ప్యాసింజరు రైలును గుంతకల్లు వరకూ పొడిగించే అవకాశం ఉంది. కనుక యశ్వంతపూర్-అనంతపురం మెము రైలును గుంతకల్లుకు తీసుకువచ్చి స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి.
-మహమ్మద్ గౌస్, గుంతకల్లు
ఈ వార్తలు కూడా చదవండి..
గాలి జనార్దన్రెడ్డిపై హత్యాయత్నం
Read Latest Telangana News and National News