శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
ABN , Publish Date - Feb 07 , 2026 | 02:42 PM
శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా సీఎంను ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు సభ్యులు ఆహ్వానించారు.
నంద్యాల, ఫిబ్రవరి 7: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో రేపటి(ఆదివారం) నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సీఎం చంద్రబాబును(CM Chandrababu) ఆహ్వానించారు ఆలయ అధికారులు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ ఛైర్మన్ రమేశ్ నాయుడు, ఈవో శ్రీనివాసరావులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలను ఆయనకు అందజేశారు అర్చక స్వాములు.
రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు..
శ్రీశైలంలో రేపటి(ఫిబ్రవరి 8) నుంచి ఈనెల 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. గతేడాది కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది భక్తులు తరలివచ్చే అవకాశముందని ఆలయ అధికారులు అంచనా వేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 13 నుంచి నాలుగు రోజుల పాటు ప్రతి భక్తునికి ఉచితంగా లడ్డూ ప్రసాదం అందించనున్నట్లు ఈవో తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మొత్తం 40 లక్షల లడ్డూ ప్రసాదాలు తయారు చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు.
బ్రహ్మోత్సవాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఈనెల 14, 15న టోల్ గేట్ల వద్ద టోల్ ఫీజు లేకుండా వాహనాలను అనుమతిస్తున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా.. రోజుకు మూడు స్లాట్లలో మాత్రమే వీఐపీ దర్శనాలకు అనుమతిస్తామని తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా రేపటి నుంచి 20వ తేదీ వరకు మల్లికార్జున స్వామివారి స్పర్శ దర్శనం నిలిపివేస్తున్నట్టు ఈవో శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
ప్రియురాలి నోట్లో పురుగుల మందు పోసిన ప్రియుడు
ఏలూరు జిల్లాలో గురుకుల విద్యార్థి ఆత్మహత్య
Read Latest AP News And Telugu News