Share News

కృష్ణా నదీ తీరాన ‘యోగాంధ్ర’.. పాల్గొన్న మీడియా ప్రతినిధులు, విద్యార్థులు

ABN , Publish Date - Jun 16 , 2026 | 09:56 AM

విజయవాడ బరమ్ పార్కులోని కృష్ణా నదీ తీరాన కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రతినిధులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు.

కృష్ణా నదీ తీరాన ‘యోగాంధ్ర’.. పాల్గొన్న మీడియా ప్రతినిధులు, విద్యార్థులు
Collector Lakshmi Sha

విజయవాడ, జూన్ 16: రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అంతా కలిసి యోగాసనాలు వేస్తున్నారు. ఈరోజు(మంగళవారం) ఉదయం కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో బరమ్ పార్కులోని కృష్ణా నదీ తీరాన యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రతినిధులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ కోసం అందరూ సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు. శరీరాన్ని ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే, మనం చేసే పనిలో అంతటి అంకితభావం ఉంటుందని తెలిపారు. వికసిత్ భారత్, విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 వంటి లక్ష్యాలను సాధించాలంటే పౌరులందరూ ఆరోగ్యంగా ఉండటం అవసరమన్నారు.


ఈ యోగాసనాలు సరళంగా ఉండి ప్రతి ఒక్కరూ సులభంగా ప్రాక్టీస్ చేసేలా ఉంటాయని కలెక్టర్ వెల్లడించారు. రోజుకు 45 నిమిషాల పాటు సమయం కేటాయిస్తే సరిపోతుందని తెలిపారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ వీఎంసీ స్టేడియం, అంబేద్కర్ కళా వేదికలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఉంటుందని.. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజలందరూ ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు సహకరించాలని కలెక్టర్ లక్ష్మీ శ పిలుపునిచ్చారు.


యోగా వల్ల ప్రయోజనాలు అనేకం: కలెక్టర్ బాలాజీ

కృష్ణాజిల్లా పామర్రు మొవ్వ మండలం కూచిపూడిలో యోగాంధ్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, అధికార ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూచిపూడి కళాకారులు, విద్యార్థులతో కలిసి కలెక్టర్, ఎమ్మెల్యే సామూహిక యోగాసనాలు వేశారు. విద్యార్థుల యోగా విన్యాసాలు అందిరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ప్రజలందరూ యోగాపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని... అప్పుడే అనేక వ్యాధులకు దూరంగా ఉంటామన్నారు. యోగా సాధన ద్వారా కలిగే ప్రయోజనాలు అనేకమని, మానసిక చైతన్యం పెరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా బాల్య దశ నుంచే యోగా అలవాటు చేసుకుంటే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని కలెక్టర్ తెలిపారు.


ప్రకృతి అందించిన వరం యోగా: ఎమ్మెల్యే

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కూచిపూడిలో యోగాంధ్ర వేడుకలు జరగడం సంతోషకరమని ఎమ్మెల్యే కుమార్ రాజా తెలిపారు. 76 ఏళ్ల వయసులో సీఎం చంద్రబాబు ఇంత చురుగ్గా ఉండడానికి కారణం... ఆయన దశాబ్దాలుగా యోగా సాధన చేయడమే అని చెప్పుకొచ్చారు. ప్రకృతి మనకు అందించిన గొప్ప వరం యోగా అని అన్నారు. యోగా చేద్దాం.... ఆరోగ్యంగా జీవిద్దాం అన్నది అందరి నినాదం కావాలని ఎమ్మెల్యే కుమార్ రాజా పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

యుద్ధం ముగియడంతో పసిడికి మళ్లీ డిమాండ్.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: ప్రహ్లాద్ జోషి

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 16 , 2026 | 10:10 AM