ఏపీ లిక్కర్ స్కాం.. వాసుదేవరెడ్డి రిమాండ్.. సిట్ రిపోర్టులో ఏముందంటే..
ABN , Publish Date - Feb 21 , 2026 | 08:23 PM
ఏపీ లిక్కర్ స్కాంకు సంబంధించి వాసుదేవరెడ్డి రిమాండ్ రిపోర్టులో.. సిట్ పలు కీలక విషయాలను ప్రస్తావించింది. ఈ కేసులో వాసుదేవ రెడ్డిదే కీలకపాత్ర అని నిర్దారించింది..
విజయవాడ, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ఏపీ లిక్కర్ స్కాంలో వాసుదేవరెడ్డిని రెండో నిందితుడిగా (A2) సిట్ అధికారులు తేల్చారు. అయితే ఇవాళ(శనివారం) పోలీసులు.. ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. ఫిబ్రవరి 27 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ క్రమంలో అతడిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.వాసుదేవరెడ్డి రిమాండ్ రిపోర్టులో.. సిట్ పలు కీలక విషయాలను ప్రస్తావించింది. ఈ కేసులో వాసుదేవ రెడ్డిదే కీలకపాత్ర అని నిర్దారించింది.
సిట్ రిమాండ్ రిపోర్టులోని కీలక విషయాలివే..
మద్యం కుంభకోణం కేసులో వాసుదేవ రెడ్డిదే కీలకపాత్ర అని సిట్ అధికారులు వెల్లడించారు. ‘సిట్ విచారణలో టెక్నికల్ ఎవిడెన్స్, FSL రిపోర్టులు, విచారించిన సాక్షులు అంతా వాసుదేవరెడ్డి కీలకమని వెల్లడించారు. మద్యం కుంభకోణం మొత్తంలో కీలక వ్యక్తిగా వ్యవహరించారు. అమ్మకాలు, కొనుగోళ్లు, ఆర్డర్లు, సరఫరా మొత్తం వాసుదేవరెడ్టి కనుసన్నల్లోనే జరిగింది. APSBCL కార్యకలాపాలు మొత్తం ఆన్లైన్లో ఉండగా, వాటిని మాన్యువల్గా మార్చడంలో కీలక పాత్ర వాసుదేవరెడ్డిదే. APSBCL వ్యవస్థ మొత్తాన్నీ ఎలాంటి అనుమతులు లేకుండానే మ్యాన్యువల్గా నడిపారు. ఈ మద్యం స్కాంలో మొత్తానికి సిండికేట్గా ఉంటూ అధికారులు, సిబ్బందిని నడిపించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజశేఖర్ రెడ్డి, అతడి అనుచరులు సుమిత్ , ప్రకాశ్ల ద్వారా సెటిల్మెంట్లు చేశారు’ అని సిట్ అధికారులు ప్రస్తావించారు.
బెదిరించి నగదు వసూలు..
O.F.S మొత్తాన్ని సిండికేట్ మెంబర్స్తో కలిసి నడిపించారని సిట్ అధికారులు తెలిపారు. ‘లిక్కర్ ఆర్డర్స్ ద్వారా కిట్ బ్యాగ్స్ తరలించడం, బ్రాండ్స్ మార్చి.. సేల్స్ మానిటరింగ్ చేశారు. నచ్చిన బ్రాండ్స్ తేవడం, నచ్చని వాటిని నిలిపివేయడం వంటి పనుల్లో వాసుదేవ రెడ్డిదే కీలక పాత్ర. లిక్కర్ కంపెనీలను బెదిరించి ఆ యజమానుల నుంచి డబ్బులు వసూలు చేశారు. పర్సంటేజీల రూపంలో వసూలు చేసి నేరాలకు పాల్పడ్డారు. పబ్లిక్ సర్వెంట్గా ఉంటూ క్రిమినల్ నేరాలను ప్రేరేపించేలా వ్యవహరించారు. ఏ2గా ఉన్న వాసుదేవ రెడ్డి తన విధులను దుర్వినియోగం చేసి.. ప్రభుత్వ ఖజానాకు రూ.192 కోట్ల నష్టం చేశారు. లిక్కర్ సేల్స్, ఆర్డర్స్ వంటి సున్నితమైన అంశాలను ప్రైవేటు వ్యక్తులకు షేర్ చేశారు. వాసుదేవ రెడ్డి ద్వారా ప్రతినెలా రూ.60 కోట్ల వరకు దారి మళ్లించారు. లిక్కర్ స్కాం ఎలా చేయాలనే దానిపై తరచూ సమావేశాలు నిర్వహించారు’ అని సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు
లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..
Read Latest Telangana News And AP News And Telugu News