ఇంగ్లండ్పై భారత్ అద్భుత విజయం సాధించింది: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Mar 06 , 2026 | 07:51 AM
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్పై అద్భుత విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లిన భారత జట్టుకు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. కీలక పోరులో సమష్టి ప్రదర్శనతో టీమ్ఇండియా విజయం సాధించడం భారత క్రీడాభిమానులకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించిన భారత జట్టుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఇంగ్లండ్పై టీమ్ఇండియా అద్భుత విజయం సాధించిందని 'ఎక్స్' వేదికగా కొనియాడారు. న్యూజిలాండ్తో ఈ నెల 8న జరిగే ఫైనల్ మ్యాచ్లో కూడా ఇదే జోరు కొనసాగించి మరోసారి ప్రపంచ కప్ను ముద్దాడాలని ఆయన ఆకాంక్షించారు.
'ఎంతో అద్భుతమైన మ్యాచ్! ఇంగ్లండ్పై అద్భుతమైన విజయం సాధించి ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు చేరిన టీమ్ఇండియాకు అభినందనలు. సంజూ శామ్సన్, శివమ్ దూబెల మెరుపు ఇన్నింగ్స్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాల చక్కటి బౌలింగ్, అక్షర్ పటేల్ చురుకైన ఫీల్డింగ్తో మంచి ప్రదర్శన చేశారు. ఉత్కంఠ పోరులో సమష్టి పోరాటంతో భారత జట్టు గొప్ప విజయం సాధించి తుదిపోరుకు చేరింది. ఫైనల్లోనూ ఇదే ఆటతీరును ప్రదర్శించాలని కోరుతున్నా' అని చంద్రబాబు అన్నారు.
నారా లోకేశ్ కూడా..
టీమ్ఇండియా సమష్టి ప్రదర్శనను మెచ్చి ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కూడా అభినందనలు తెలిపారు. 'సెమీస్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. సంజూ శామ్సన్, శివం దూబె చక్కటి ఆటతీరుతో టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్పై చిరస్మరణీయ విజయం సాధించాం. ఈ ఆధిపత్య ప్రదర్శనకు జట్టులోని సభ్యులందరికీ అభినందనలు. దేశం మిమ్మల్ని ప్రోత్సహిస్తోంది. ఫైనల్లోనూ మరింత మెరుగైన ప్రదర్శనతో దేశానికి కప్ తీసుకురావాలి' అని లోకేశ్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
కాగా.. ఇంగ్లండ్పై గెలిచిన టీమ్ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్లో ఇప్పటివరకూ ఏ జట్టుకూ సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకుంది భారత్. పురుషుల పొట్టి ప్రపంచకప్ ఫార్మాట్లో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. పొట్టి క్రికెట్లో అత్యధిక సార్లు 250 ప్లస్ స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. తద్వారా ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టింది. కాగా.. సూపర్-8లో జింబాబ్వేపై 256 పరుగులు సాధించిన భారత జట్టు.. సెమీస్లోనూ 250కి పైగా స్కోరు నమోదు చేసింది. ఈ విజయంతో భారత అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రపంచ క్రికెట్లో భారత్ తన బలాన్ని మరోసారి నిరూపించిందని క్రీడాభిమానులు అంటున్నారు.
ఇవీ చదవండి:
గంజాయి సిగరెట్ కావాలా.. నాయనా..!
పప్పుశనగ ధరలు ఢమాల్.. రైతుల్లో ఆందోళన