సీఎం అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశం.. ఫలితాలే ముఖ్యమన్న డిప్యూటీ సీఎం
ABN , Publish Date - Feb 09 , 2026 | 11:02 AM
సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో కీలక సమీక్షా సమావేశం మొదలైంది. జీఎస్డీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధన కోసం పది సూత్రాల అమలు తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరుగనుంది..
అమరావతి, ఫిబ్రవరి 9: సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో కీలక సమీక్షా సమావేశం సోమవారం ప్రారంభమైంది. సీఎస్ కె.విజయానంద్ స్వాగతోపన్యాసం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) మాట్లాడుతూ.. పల్లె పండగ కార్యక్రమం కింద గత ఏడాది రూ.2,500 కోట్లు మంజూరు చేస్తే, ఇప్పుడు 2.0 కింద రూ.5,700 కోట్లు, అడివితల్లి బాటకు రూ.1,005 కోట్లు, సాస్కికి రూ.2,123 కోట్లు.. మొత్తం రూ.11,328 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు.
జలజీవన్ మిషన్ కింద కేంద్ర, రాష్ట్ర షేర్లతో పనులు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇప్పటికే రూ.10 వేల కోట్ల పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఉన్న తక్కవ వనరులను ఉపయోగించుకొని ఎక్కవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాని సహాయ సహకారాలు, ముఖ్యమంత్రి అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. ప్రతి రూపాయి క్షేత్రస్థాయిలో కనిపించాలని... ప్రాజెక్టులు పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ఉదాసీనత ఉంటుందన్నారు డిప్యూటీ సీఎం. ముఖ్యమంత్రి ఇచ్చిన టార్గెట్లు రీచ్ కావలంటే చాలా వరకూ ఎక్స్యూజెస్ కనిపిస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి, తాను అకౌంటబిలిటీ ఫిక్స్ చేసుకుంటున్నామని.. అందుకే క్షేత్ర స్థాయిలో ఫలితాలు రావాలని కోరుతున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
చర్చించే అంశాలివే..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో జీఎస్డీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధన కోసం పది సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖల పురోగతిపై సమీక్షించనున్నారు. 2026-27లో కేంద్ర ప్రాయోజిత పథకాల కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం. రియల్ టైమ్ గవర్నెన్స్లో భాగంగా అవేర్ సిస్టమ్, పాలనలో ఏఐ టూల్స్, ఇతర సాంకేతికతల వినియోగంపై సమావేశంలో చర్చ జరగనుంది. అలాగే నైపుణ్యాభివృద్ధి, వన్ ఫ్యామిలీ - వన్ ఎంట్రప్రెన్యూర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రాష్ట్రంలో శాంతిభద్రతల అంశాలపై సీఎం సమీక్ష చేపట్టనున్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్గా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
‘ఉపాధి’ పనుల స్పీడ్కు బ్రేకులు
Read Latest AP News And Telugu News