మోదీ నాయకత్వంలో భారత్ దూసుకుపోతోంది: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:22 AM
సింగపూర్ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపుతున్నారు. కాపిటలిస్టుల రౌండ్టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
అమరావతి/సింగపూర్, జూన్ 15: సింగపూర్ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపుతున్నారు. కాపిటలిస్టుల రౌండ్టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. భారత్ సంస్కరణలతో దూసుకుపోతున్న అతిపెద్ద ఆర్థికశక్తి అని అన్నారు. చైనా లాంటి దేశాలు ఆర్థిక అభివృద్ధి సాధించటానికి దశాబ్దాల కాలం పట్టిందని.. కానీ భారత్కు అంత సమయం పట్టడం లేదని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ దేశాన్ని అద్భుతమైన వేగంతో అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. మెడికల్ టెక్నాలజీ సహా ఆధునిక పరికరాల తయారీలో భారత్ది అగ్రస్థానమన్నారు.

ఎలక్ట్రానిక్స్ పరికరాలు భారత్ నుంచి ఎగుమతి అవుతున్నాయని సీఎం వెల్లడించారు. 5వ జనరేషన్ యుద్ధ విమానాల తయారీ సహా ఇతర ఉత్పత్తులు వస్తున్నాయన్నారు. డెమోగ్రాఫిక్ డివిడెంట్తో అతిపెద్ద యువశక్తి కలిగిన మానవ వనరులను భారత్ కలిగి ఉందన్నారు. ఏపీలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా వన్ ఫ్యామిలీ వన్ ఆంత్రప్రెన్యూర్ విధానాన్ని అనుసరిస్తున్నామన్నారు. భూ సమీకరణ అనే కొత్త విధానం ద్వారా ప్రాజెక్టులకు భూములు ఇస్తున్నామని.. అమరావతి రాజధాని ఈ ప్రాతిపదికనే నిర్మిస్తున్నామని చెప్పారు. ఆమ్కా, గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ పరిశ్రమలకు భూములను కేటాయించామని తెలిపారు.

శ్రీసిటీ లాంటి ప్రత్యేక పారిశ్రామిక వాడలు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని సీఎం అన్నారు. పౌర సేవలతో పాటు అన్ని అంశాలకూ టెక్నాలజీని అనుసంధానించామన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పెట్టుబడులకు ఆస్కారం ఉందని తెలిపారు. వెంచర్ కాపిటలిస్టులు ఆ సంస్థ తయారు చేసిన స్టార్టప్లకు పెట్టుబడులు అందించే అవకాశం ఉందన్నారు. అత్యుత్తమ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వెంచర్ కాపిటలిస్టులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ సమావేశానికి సింగపూర్లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, ఏపీ మంత్రి నారాయణ, సింగపూర్ స్టార్టప్ వెంచర్ కాపిటలిస్టులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి...
ఇంటర్లో 950 మార్కులు సాధించిన విద్యార్థి కరెంట్ షాక్తో మృతి
ప్రభుత్వ ఆస్పత్రులు, స్కూళ్లు వద్దనే భావనను తొలగించేలా కసరత్తు: మంత్రి పొన్నం ప్రభాకర్
Read Latest AP News And Telugu News