గుంటూరు ఛానల్ ఆధునీకరణకు ప్రభుత్వం సిద్ధం: మంత్రి రామానాయుడు
ABN , Publish Date - Feb 24 , 2026 | 11:58 AM
గుంటూరు ఛానల్ ఆధునీకరణపై ఎమ్మెల్సీ హనుమంతరావు ప్రశ్నకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు. ఈ ఛానల్ను మెరుగుపరిచేందుకు 369 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారని.. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు.
అమరావతి, ఫిబ్రవరి 24: గుంటూరు ఛానల్ ఆధునీకరణపై ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ప్రశ్న లేవనెత్తారు. గుంటూరు ఛానల్ సంబంధిత కట్టలు దెబ్బతిన్నాయని తెలిపారు. మంగళగిరి పట్టణం నుంచి మురుగు నీరంతా ఈ ఛానల్లో కలుస్తోందని చెప్పారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఈ ఛానల్ మంత్రి నారా లోకేశ్(Minister Nara lokesh) నియోజకవర్గ పరిధిలో ఉండటంతో ఆయనే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హనుమంతరావు కోరారు.
ఈ ప్రశ్నపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానిమస్తూ.. గుంటూరు ఛానల్ ఆధునీకరణకు 369 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారని తెలిపారు. ఈ అంచనాల అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. 2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.370 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీఓ జారీ చేసిందన్నారు. అయితే.. 2021లో ఆ నిధులను రద్దుచేస్తూ కొత్త అంచనాలు రూపొందించాలని నిర్ణయించినట్లు గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.369 కోట్లతో పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.
ఛానల్ పొడిగింపునకు రూ.285 కోట్లు విడుదల చేశామని మంత్రి నిమ్మల వెల్లడించారు. మంగళగిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గుంటూరు ఛానల్లో మురుగు కలవకుండా చూడాలని, దీనిపై మంత్రి నారా లోకేశ్ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని ఆలపాటి రాజా కోరారు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. మొదటి దశ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుచేయాలని నిర్ణయించామని తెలిపారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు.. ‘అడవితల్లి బాట’పై మంత్రి సమాధానం
త్వరలోనే పశు వైద్యశాలల్లో వైద్యుల నియామకం: మంత్రి అచ్చెన్నాయుడు
Read Latest AP News And Telugu News