Share News

AP CID Rescue: సైబర్ ముఠాకు చిక్కిన 22 మంది ఏపీ యువత సేఫ్

ABN , Publish Date - Jan 12 , 2026 | 02:22 PM

ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్లి సైబర్ ముఠా చేతిలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులకు గురైన ఏపీకి చెందిన యువతను సీఐడీ పోలీసులు రక్షించారు. భారత దేశ యువకులు ఈ సైబర్ ముఠా ట్రాప్‌‌లో పడుతున్నారని సీఐడీ ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తెలిపారు.

AP CID Rescue: సైబర్ ముఠాకు చిక్కిన 22 మంది ఏపీ యువత సేఫ్
AP CID Rescue

అమరావతి, జనవరి 12: ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లి సైబర్ మోసాల ముఠాకు చిక్కుకున్న ఏపీకి చెందిన 22మందిని సీఐడీ పోలీసులు రక్షించారు. దీనిపై సీఐడీ ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా మీడియాతో మాట్లాడుతూ... సైబర్ శ్లావరీ స్లేవరీలో భాగంగా ఈస్ట్ ఆసియా దేశాలలో చిక్కుకున్న భారతీయులకు విముక్తి కలిగించామన్నారు. ఫ్రీ జాబ్ ఆఫర్స్ కోసం విదేశాలకు వెళ్లి సైబర్ క్రైమ్ కూపంలో ఇరుక్కుంటున్నారని.. బ్యాంకాక్, మయన్మార్, కంబోడియా వంటి దేశాలలో జాబ్ కోసం వెళ్లిన భారతదేశ యువకులు ఈ సైబర్ ముఠా ట్రాప్‌‌లో పడుతున్నారని తెలిపారు. కాల్ సెంటర్ల ద్వారా యువతను ఆకట్టుకునేలా మాటలు చెబుతున్నారని.. ఫ్లైట్ టిక్కెట్లు కూడా ఏర్పాటు చేసి, మంచి ఉద్యోగం ఇస్తామని నమ్మబలుకుతారని సీఐడీ ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా వెల్లడించారు.


బెదిరించి.. భయపెట్టి మరీ...

ఆయా దేశాల్లో 15 గంటల ప్రయాణం తర్వాత అటవీ ప్రాంతంలో ఉంచి.. సైబర్ క్రైమ్ లో భాగస్వామ్యులుగా చేస్తున్నారని అదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. యువకుల పాస్‌పోర్టు, ఫోన్లు లాగేసుకుని.. అనేక విధాలుగా సైబర్ క్రైమ్ లు చేయిస్తున్నారని చెప్పారు. ఫోన్లు చేసి హనీ ట్రాప్‌లు చేసేలా వీరిని బలవంతంగా ఒప్పించి పని చేయిస్తారన్నారు. మాట వినకుంటే.. తిండి పెట్టకుండా.. ఇబ్బందులు పెడతారని.. బెదిరించి, చెప్పినట్లు మోసం చేస్తేనే వారికి తిండి పెడతారని ఆయన తెలిపారు. ఎవరైనా వెళ్లిపోతామంటే.. రూ.10లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. దీంతో ఏ దారి లేక చాలా మంది భారతీయ యువత ఈ తరహాలో మోసపోయి.. సైబర్ క్రైమ్ లకు పాల్పడుతున్నారని సీఐడీ ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా పేర్కొన్నారు.


1,586 మంది వెనక్కి..

భారతదేశ ప్రభుత్వం ఈ తరహా మోసాలను గుర్తించి వారిని తీసుకు వచ్చేలా ఏర్పాట్లు చేసిందని సీఐడీ ఎస్పీ తెలిపారు. ఈ విధంగా తాజాగా 22మంది ఏపీకి చెందిన వారిని క్షేమంగా తీసుకురాగా, వారిని సీఐడీ విచారించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా 1,586మంది ఇలా సైబర్ మోసాల బారిన పడిన వారిని మూడు నెలల్లో వెనక్కి తీసుకువచ్చారన్నారు. వీరిలో ఏపీకి చెందిన వారు 120 మంది ఉన్నారని తెలిపారు. వీరిలో పురుషులతోపాటు మహిళలు, యువత కూడా చాలా మంది ఉన్నారన్నారు. అక్కడ ఎలా మోసం జరుగుతుంది.. ఆకర్షితమైన ప్రకటనలు ఎలా ఉంటాయో వారు తెలిపారని చెప్పారు. భారతీయ రీజనల్ లాంగ్వేజ్ బాగా మాట్లాడే వారిని గుర్తించి మరీ ఈ మోసాల్లోకి దింపుతున్నారని చెప్పారని సీఐడీ ఎస్పీ తెలిపారు.


తల్లిదండ్రులు జాగ్రత్త..

ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు, పెద్ద జీతం చూపినప్పుడు పూర్తిగా వెరిఫై చేసుకున్నాకే ఆయా దేశాలకు వెళ్లాలని సూచించారు అదిరాజ్ సింగ్ రాణా. ఇటువంటి ఆఫర్లు వచ్చినప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తే.. ఆ సంస్థ గురించి ఆరా తీసి వివరాలు ఇస్తారన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల గురించి ఆలోచన చేయాలని.. మంచి ఉద్యోగం, జీతం అనగానే అప్పులు చేసి పిల్లలను ఆయా దేశాలకు పంపవద్దని సూచించారు. డబ్బులతోపాటు, పిల్లల భవిష్యత్ కూడా నాశనం అవుతుందని హెచ్చరించారు. ఇటువంటి మోసాలపై మీడియా కూడా ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఐడీ ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా కోరారు.


బాధితులు ఏం చెప్పారంటే..

‘సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి సంప్రదించాం. మంచి ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్లైట్ టిక్కెట్లు వారే ఇచ్చారు. అక్కడకు వెళ్లిన తర్వాత మారు మూల ప్రాంతానికి తరలించారు. రెండు నెలలు వీసా ఇచ్చి.. వారి ఆధీనంలో ఉంచుకున్నారు. పాస్ పోర్టు, ఫోన్లు కూడా లాగేసుకుంటారు. వారు ఇచ్చే ఫోన్లనే ఆపరేట్ చేయాలి. ఫేక్ ఎకౌంట్లను క్రియేట్ చేసి వాటి ద్వారా ఆపరేటివ్ చేయిస్తారు. 500K టూ 1000K వరకు మాకు లక్ష్యాలు ఇచ్చి.. మాట్లాడిస్తారు. మయన్మార్‌లో గత రెండు నెలలుగా చాలా ఇబ్బందులు పడ్డాం. అసలు ఎవరితో అక్కడ మేము మాట్లాడే అవకాశం ఉండదు. వారికి స్పెషల్ ఆర్మీ ఉంటుంది.. చేతిలో గన్‌లు ఉంటాయి. ఏదైనా మాట్లాడితే .. చంపేస్తామని బెదిరిస్తారు. ఒక్కో గదిలో పది మంది సభ్యులకు షెల్టర్ ఇస్తారు. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే.. గదిలో బంధించి చిత్ర హింసలు పెడతారు. కొట్టడంతోపాటు, కరెంటు షాక్‌లు కూడా ఇచ్చేవారు. ఏజెంట్లకు రూ.2లక్షల వరకు కట్టి వెళ్లాం. ఆ తర్వాత అదే ఏజెంట్‌కు వాళ్లు కూడా డబ్బులు ఇస్తారని తెలిసింది. టెలిగ్రామ్ ద్వారా మాకు ఈ ఉద్యోగ అవకాశాలు రావడంతో వెళ్లాం. మోసం తెలుసుకుని వెనక్కి రావాలంటే రూ.10లక్షలు కడితేనే వదిలేస్తామని బెదిరించేవారు. ఉదయం నుంచి రాత్రి వరకు 18 గంటలపాటు మాతో వర్క్ చేయించుకునే వారు. తొలి మూడు నెలల ట్రైనింగ్ అన్నారు. ఆ తర్వాత మూడు నెలలు మాకు రూపాయి శాలరీ ఇవ్వలేదు. అక్కడ మాట్లాడే వారంతా చైనీస్ భాషే ఎక్కువగా వాడుతున్నారు. వాళ్లే ఏం టైపు చేయాలి, ఏం మాట్లాడాలో చెబుతారు. అవే మేము అమలు చేయాలి. ఏది అడిగినా ఎటువంటి సమాచారం మాకు చెప్పరు. ఒక్కసారి లోపలకు వెళ్లామంటే.. వారికి వారు పంపాలే తప్ప. తప్పించుకుని వచ్చే పరిస్థితి అక్కడ లేదు. ఎవరైనా ప్రయత్నిస్తే.. గన్‌లతో కాల్చి చంపేసిన ఘటనలు కూడా ఉన్నాయి’ అని బాధితులు తమ ఆవేదనను వెలిబుచ్చారు.


ఇవి కూడా చదవండి...

అమరావతిలో జోరుగా ల్యాండ్ పూలింగ్.. కర్లపూడిలో ప్రారంభం

తిరుపతిలో ఒంటరి మహిళ అనుమానాస్పద మృతి..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 12 , 2026 | 04:30 PM