Amaravati Land Pooling: అమరావతిలో జోరుగా ల్యాండ్ పూలింగ్.. కర్లపూడిలో ప్రారంభం
ABN , Publish Date - Jan 12 , 2026 | 10:43 AM
అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ఊపందుకుంది. పల్నాడు జిల్లాలోని కర్లపూడి - లేమల్లెలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మంత్రి నారాయణ ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన మంత్రి, ఎమ్మెల్యేకు రైతులు ఘన స్వాగతం పలికారు.
అమరావతి/పల్నాడు జిల్లా, జనవరి 12: రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఈరోజు(సోమవారం) పెదకూరపాడు మండలం కర్లపూడి - లేమల్లెలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ(Minister Narayana) ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో కలిసి రైతుల నుంచి అంగీకార పత్రాలను మంత్రి స్వీకరించారు. కాంపిటెంట్ అథారిటీ.. గ్రామంలో 2654 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో ల్యాండ్ పూలింగ్ కోసం గ్రామానికి వచ్చిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్కు రైతులు ఘన స్వాగతం పలికారు. తమ గ్రామాన్ని ల్యాండ్ పూలింగ్కు ఎంపిక చేసినందుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu), మంత్రి నారాయణకు అన్నదాతలు ధన్యవాదాలు తెలిపారు.
కాగా.. అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం 7 గ్రామాల్లో సుమారు 16,666 ఎకరాలు భూసమీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి మండలంలో వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె గ్రామాలు ఉండగా.. మిగిలిన 3 గ్రామాలు(వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి) గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 7 గ్రామాలకు గానూ 4 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా నగరం, స్మార్ట్ పరిశ్రమలు, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్రోడ్డు కోసం ప్రభుత్వం ఈ భూములను సేకరిస్తోంది.
ఇవి కూడా చదవండి...
దుర్గగుడిలో అపచార ఘటనపై ఈవో తాజా ఆదేశాలివే..
Read Latest AP News And Telugu News