బడ్జెట్ ప్రతులతో కనక దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Feb 14 , 2026 | 09:59 AM
ఏపీ 2026-27 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్ ప్రతులను దుర్గమ్మ సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
అమరావతి, ఫిబ్రవరి 14: ఏపీ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో బడ్జెట్ ప్రతులను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు. వీటికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. బడ్జెట్ ప్రతులపై దైవానుగ్రహం ఉండాలని, రాష్ట్ర ప్రజలందరికీ ఈ పద్దు ద్వారా మేలు జరగాలని కోరుతూ.. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూశ్ కుమార్, కార్యదర్శులు వినయ్ చంద్, రోనాల్డ్ రాస్, జాయింట్ సెక్రటరీ గౌతమ్ అల్లాడ, డిప్యూటీ సెక్రటరీ సూరజ్ గనోర్ తదితరులు దుర్గ గుడిలో పూజలు నిర్వహించారు.
పూజ అనంతరం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నివాసానికి వెళ్లిన అధికారులు.. బడ్జెట్ ప్రతులను మంత్రికి అందజేశారు. ఆ ప్రతులను దేవుడి ముందు పెట్టి పూజలు నిర్వహించారు పయ్యావుల. ఆ తర్వాత బడ్జెట్ ప్రతులతో వెంకటపాలెంలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చేరుకున్న మంత్రి.. అక్కడ మరోసారి పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు. అక్కడి నుంచి సచివాలయానికి బయలుదేరారు. సచివాలయంలోని తన ఛాంబర్లో మరోసారి పూజలు చేసిన అనంతరం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో జరగనున్న కేబినెట్ సమావేశానికి పద్దు ప్రతులతో హాజరుకానున్నారు.
ఇవి కూడా చదవండి...
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు రీచ్ అయ్యాయంటే.?
ఏ జిల్లాలో ఏ మున్సిపాలిటీలు ఎవరికి దక్కాయంటే..?
Read Latest AP News And Telugu News