పల్లెపండుగ రూపంలో గ్రామీణ రోడ్ల నిర్మాణం: మంత్రి నాదెండ్ల మనోహర్
ABN , Publish Date - Mar 06 , 2026 | 10:26 AM
ఉపాధి హామీ పథకం కింద పల్లెపండుగ రూపంలో గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపట్టామని ఏపీ శాసనసభలో మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పల్లెపండుగ 1 కింద 4 వేల కిలోమీటర్ల మేర వివిధ రోడ్లు వేశామన్నారు.
అమరావతి, మార్చి 6: ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. పల్లెపండుగ 2.0 అమలుపై ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ (MLA Konatala Ramakrishna) ప్రశ్న అడిగారు. పల్లెపండుగ కార్యక్రమంలో వేలాది కిలోమీటర్లు రోడ్లు వేశారని.. దీనివల్ల ఎమ్మెల్యేలంతా గౌరవంగా గ్రామాల్లోకి వెళ్లగలుగుతున్నారని తెలిపారు. ఉపాధి హామీ నిబంధనలను కేంద్రం మార్చిందని.. దీంతో రాష్ట్ర వాటా 10శాతం నుంచి 40శాతానికి పెరిగిందని చెప్పారు. ఆ మేరకు బడ్జెట్లో రాష్ట్ర కేటాయింపులు పెంచాలని ఎమ్మెల్యే కోరారు.
వైసీపీ హయాంలో జలజీవన్ మిషన్ పథకం సద్వినియోగం చేయలేదని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) చొరవతో కేంద్రం నిధులు మంజూరు చేసిందన్నారు. త్వరగా పనులు పూర్తి చేసి గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. గ్రామాల్లో డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉంటుందని.. గతంలో డ్రైనేజీలకు నిధులు ఇవ్వలేదని... ఈసారైనా నిధులివ్వాలన్నారు. పనిదినాలను125 రోజులకు పెంచారని.. దీని వల్ల రాష్ట్రానికి 5 కోట్ల పనిదినాలు పెరిగాయని తెలిపారు. పనులకు సంబంధించి కొన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయని... వాటిని మంజూరు చేయాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కోరారు.
ఈ ప్రశ్నకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి పవన్ కళ్యాణ్కు బదులు మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) సమాధానం ఇచ్చారు. ఉపాధి హామీ పథకం కింద పల్లెపండుగ రూపంలో గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, ఇంకుడు గుంతలు, మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మిస్తున్నామన్నారు. 2025-26 కోసం బడ్జెట్లో రూ.4350కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. 2022 నుంచి ఇప్పటి వరకూ చేపట్టిన పనులకు సాస్కి కింద రూ.1342కోట్లు వచ్చాయని మంత్రి వివరించారు. పల్లెపండుగ 1 కింద 4 వేల కిలోమీటర్ల మేర వివిధ రోడ్లు వేశామన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు1594 కిలోమీటర్ల రహదారులు వేసినట్లు చెప్పారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో 21.30 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్లు వేశామన్నారు. డ్రైనేజీ వ్యవస్థలో ఇదో విప్లవమని... చాలాచోట్ల ఈ డిమాండ్ ఉందని చెప్పారు. గత వైసీపీ హయాంలో రూ.13,300 కోట్ల మేర జలజీవన్ మిషన్ నిధులు నిలిచిపోయాయని తెలిపారు. ఉపాధిహామీ పథకంలో నిబంధనలు మార్చారని.. దీనిపై పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు రాలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇంగ్లండ్పై భారత్ అద్భుత విజయం సాధించింది: సీఎం చంద్రబాబు
గుంటూరులో డిస్నీ ల్యాండ్ ఏర్పాటుపై ఎమ్మెల్యే ప్రశ్న.. మంత్రి సమాధానం ఇదే
Read Latest AP News And Telugu News