Share News

ఆస్తి కోసం తల్లి, చెల్లిని తరిమేశాడు.. జగన్ వ్యక్తిత్వం అది: మంత్రి అనగాని సత్యప్రసాద్

ABN , Publish Date - May 23 , 2026 | 03:22 PM

జగన్ పూర్వీకుల చరిత్ర, ఆయన చరిత్ర ఏంటి అనేది ప్రపంచంలో అందరికీ తెలుసని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. ఎన్ని దారుణాలు చేశారో, ఎన్ని హత్యలు చేశారో రాయలసీమలో ఏ గడపని అడిగినా చెప్తారని అన్నారు.

ఆస్తి కోసం తల్లి, చెల్లిని తరిమేశాడు.. జగన్ వ్యక్తిత్వం అది: మంత్రి అనగాని సత్యప్రసాద్
Anagani Satya Prasad

అమరావతి, మే 23: గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్తగా తాను చాలా అమాయకుణ్ణి, అహింసావాదిని అంటూ మాట్లాడుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ సెటైర్ విసిరారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పూర్వీకుల చరిత్ర, ఆయన చరిత్ర ఏంటి అనేది ప్రపంచంలో అందరికీ తెలుసన్నారు. ఎన్ని దారుణాలు చేశారో, ఎన్ని హత్యలు చేశారో రాయలసీమలో ఏ గడపని అడిగినా చెప్తారని అన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం గురించి ఎవరిని అడిగినా కథలు కథలుగా చెప్తారని వ్యాఖ్యానించారు. అటువంటి రాజారెడ్డి పోలికలు తనకొచ్చాయని చెప్పుకున్న వ్యక్తి జగన్ అంటూ దుయ్యబట్టారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు చేసిన అరాచకాలు కళ్లారా చూశామని మంత్రి అన్నారు.


వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని.. తన వ్యాపారానికి అడ్డుగా ఉన్న ప్రతి ఒక్కరినీ హతమార్చారని జగన్‌పై మంత్రి ఆరోపణలు గుప్పించారు. పరిటాల రవితో సహా ఎంతోమందిని హత్య చేశారన్నారు. అమరనాథ్ గౌడ్, సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయంలో ఏమైందో అందరికీ తెలుసన్నారు. ‘తల్లిని తరిమేశాడు.. చెల్లిని ఆస్తి కోసం తరిమేశాడు.. అతని వ్యక్తిత్వం అలాంటిది’ అంటూ వ్యాఖ్యానించారు. బాబాయ్ హత్య కేసుపై సీబీఐ వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే.. తన పార్టీ ఎంపీని కాపాడేందుకు సీబీఐ అధికారులపైనే దాడి చేసి తరిమేశారని మండిపడ్డారు.


వైఎస్ సునీత ఆవేదన కనిపించటం లేదా అని మంత్రి ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా చేసిన ఐదేళ్లలో బాబాయ్‌ను హత్య చేసిన వ్యక్తిని కనుక్కోలేకపోయారా అని నిలదీశారు. ప్రజలను తప్పుదోవ పట్టిద్దామనుకుంటే నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు ఆ 11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నారు. ‘ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. యువత హ్యాపీగా ఉంది. ఉద్యోగాలు వస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమం జరుగుతోందన్న ఆనందంలో ప్రజలు ఉన్నారు’ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

అందరం కలిసికట్టుగా మహానాడును విజయవంతం చేద్దాం: మంత్రి లోకేశ్

నాలుగు వారాల్లో సమస్యను పరిష్కరించుకోవాలి.. ఎమ్మెల్యేకు పవన్ సూచన

Read Latest AP News And Telugu News

Updated Date - May 23 , 2026 | 04:40 PM