ఎన్ని కుట్రలు పన్నినా అనుకున్న సమయానికే అమరావతి పూర్తి: మంత్రి నారాయణ
ABN , Publish Date - Jul 08 , 2026 | 11:17 AM
అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లే అవుట్ పనుల పురోగతిపై చర్చించారు.
అమరావతి, జులై 8: అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ ఈరోజు(బుధవారం) సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లే అవుట్ పనుల పురోగతిపై చర్చించారు. ప్రాజెక్టుల వారీగా పనులు ఎంత మేరకు పూర్తయ్యాయనే దానిపై కాంట్రాక్ట్ సంస్థలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ ‘మావిగన్’ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని వ్యవస్థలను ఓ చోటకు తీసుకొస్తే... అవగాహన లేకుండా మావిగన్ అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా అనుకున్న సమయానికి అమరావతి తొలిదశ పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు.
అమరావతి నిర్మాణాలపై గొడ్డలి పార్టీ పోలికలు పొంతన లేనివని మంత్రి మండిపడ్డారు. ఐకానిక్ భవనాలతో సాధారణ భవన నిర్మాణాల ఖర్చును పోల్చుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మావిగన్ vs అమరావతితో ఎన్నికలకు వెళ్తానంటున్న జగన్ మాటలకు వైసీపీ నేతలే ఛీ కొడుతున్నారన్నారు. దోమలు లేని నగరంగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు భూగర్భ వ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్ పూర్తైనట్లు తెలిపారు. ఈ నెలాఖరుకు ఎమ్మెల్సీ, ఏఐఎస్ టవర్లు పూర్తవుతాయన్నారు. పూర్తైన భవనాలను జీఏడీకి అప్పగిస్తున్నామని.. వారి నిబంధనలకు తగ్గట్టుగా కేటాయింపులు జరుగుతాయని వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం నిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ సమావేశానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్ ఇన్ చీఫ్ గోపాలకృష్ణా రెడ్డి, ఇంజినీర్లు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
కడప రిమ్స్ డెంటల్ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. 20 మందికిపైగా విద్యార్థులకు అస్వస్థత
కొరియా కంపెనీలకు లోకేశ్ ఆహ్వానం.. బుసాన్లో APEX-Korea ప్రారంభం
Read Latest AP News And Telugu News