అమరావతిలో రూ.2,534 కోట్లతో కేంద్రం భారీ నిర్మాణాలు
ABN , Publish Date - Apr 08 , 2026 | 03:47 PM
అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. రూ.2,534 కోట్లతో అమరావతిలో కేంద్రం భారీ నిర్మాణాలను చేపట్టనుంది.
న్యూఢిల్లీ/అమరావతి, ఏప్రిల్ 8: ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.2,534 కోట్లతో అమరావతిలో కేంద్రం భారీ నిర్మాణాలను చేపట్టనుంది. అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్(CCS) నిర్మాణం కోసం రూ.1,299.08 కోట్లు, నివాస సముదాయాల(GPRA) ఏర్పాటు కోసం రూ.1,234.91 కోట్లతో కూడిన పీఐబీ (PIB) మెమోరాండం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగాలంటే కేబినెట్ సెక్రటేరియట్ వద్ద పెండింగ్లో ఉన్న ఫైల్కు క్లియరెన్స్ రావాల్సి ఉంది.
అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ వెలువడిన గెజిట్ నోటిఫికేషన్ను ఏపీ అధికారులు ఇప్పటికే కేబినెట్ సెక్రటేరియట్కు సమర్పించారు. వచ్చే కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు అనుమతి లభించే అవకాశం ఉంది. ప్రాజెక్టు తదుపరి అనుమతులకు కీలకమైన కేబినెట్ సెక్రటేరియట్ క్లియరెన్స్ మాత్రమే పెండింగ్ ఉంది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఫైల్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారు.
అమరావతిలో కేంద్ర నిర్మాణాల కోసం మొత్తం 22.53 ఎకరాల భూమిని కేటాయించారు. సీపీడబ్ల్యూడీ (CPWD) కోసం 22.53 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం ఆఫర్ చేసింది. ఇందులో 5.53 ఎకరాలు సెక్రటేరియట్ నిర్మాణానికి, 17 ఎకరాలు నివాస సముదాయాల(GPRA) ఏర్పాటుకు కేటాయించారు. కేబినెట్ సెక్రటేరియట్ నుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులు మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి...
గుంటూరులో అంబటి రాంబాబు వీరంగం.. పోలీసులతో దురుసు ప్రవర్తన
అత్యధిక స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించడమే లక్ష్యం: పట్టాభిరాం
Read Latest AP News And Telugu News