Share News

రైల్వే జోన్‌తో మారనున్న ఉత్తరాంధ్ర రూపురేఖలు: మంత్రి సత్యకుమార్

ABN , Publish Date - May 31 , 2026 | 07:01 PM

దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ రైల్వే జోన్ కార్యకలాపాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతుండడం పట్ల ఆదివారం అమరావతిలో ఆయన హర్షం వ్యక్తం చేశారు.

రైల్వే జోన్‌తో  మారనున్న ఉత్తరాంధ్ర రూపురేఖలు: మంత్రి సత్యకుమార్
Y Satya Kumar

అమరావతి, మే31: దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ రైల్వే జోన్ కార్యకలాపాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతుండడం పట్ల ఆదివారం అమరావతిలో ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో ఇప్పటికే ఉత్తరాంధ్ర ముఖ్యంగా విశాఖపట్నం ఐటీ హబ్‌గా మారిందన్నారు. అదే సమయంలో రైల్వే జోన్ కొత్తగా రావడం ద్వారా ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయని పేర్కొన్నారు. విశాఖ నగరం రైల్వే రంగంలో అనూహ్య రీతిలో అభివృద్ధి జరగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త రైల్వే జోన్ వల్ల విశాఖపట్నం - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇలా అన్ని రకాలుగా ఉత్తరాంధ్ర గమ్యస్థానంగా మారబోతుండడం సంతోషంగా ఉందన్నారు.


విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయని చెప్పారు. 2014 రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకుందని ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గుర్తు చేశారు. ఇది ఉత్తరాంధ్ర ప్రజల విజయంగా ఆయన అభివర్ణించారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు సమర్థ పాలన ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నాయని తెలిపారు. అందుకు కొత్తగా ఏర్పడిన రైల్వే జోన్ కూడా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేందుకు తోడ్పడనుందన్నారు. రాష్ట్రంలో రైల్వే రంగంలో సుమారు రూ. 85 వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు.


2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.10,135 కోట్లు కేంద్రం కేటాయించిందని తెలిపారు. 2013-14లో మొత్తం రూ. 886 కోట్లు మాత్రమే కేటాయించిందని గుర్తు చేశారు. ఇలా నిధుల కేటాయింపుతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ఎంత ప్రత్యేక శ్రద్ధ పెట్టిందనేది దీని ద్వారా స్పష్టమవుతుందని ఆయన సోదాహరణగా వివరించారు. విశాఖ రైల్వే జోన్ కల నెరవేర్చినందుకు ప్రధాని మోదీతోపాటు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి సత్యకుమార్ కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం

సీఎం రేవంత్ మాటలకు విశ్వసనీయత ఉందా?..: ఎమ్మెల్యే హరీష్ రావు

For More AP News And Telugu News

Updated Date - May 31 , 2026 | 07:14 PM