Share News

సీఎం రేవంత్ మాటలకు విశ్వసనీయత ఉందా?..: ఎమ్మెల్యే హరీష్ రావు

ABN , Publish Date - May 31 , 2026 | 05:23 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి నిప్పులు చెరిగారు.

సీఎం రేవంత్ మాటలకు విశ్వసనీయత ఉందా?..: ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్ధిపేట, మే 31: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి నిప్పులు చెరిగారు. నాలుగు పార్టీలు మారినోడు.. దేవుళ్లపై ఓట్లు వేసి మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాటలకు క్రెడిబిలిటీ ఉందా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. పూటకో జెండా పట్టే రేవంత్ రెడ్డికి తన గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? అని హరీష్ రావు ప్రశ్నించారు. నా పుట్టుక బీఆర్ఎస్.. చివరి వరకు నేను ఇదే పార్టీలో ఉంటానని ఆయన కుండబద్దలు కొట్టారు. పార్టీలు మారే గుణం నీది.. చిల్లర మాటలు మానుకో అంటూ సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు హితవు పలికారు.


ఆదివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హరీష్ రావు విలేకర్లతో మాట్లాడుతూ.. 24 గంటల ఉచిత విద్యుత్ కోసం ఆర్పీడీసీఎల్ (Rpdcl) ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ చెప్పారన్నారు. వాస్తవం వేరు.. సీఎం మాట్లాడేది వేరంటూ ఆయన మండిపడ్డారు. అర్పిడీసీఎల్‌తో 24 గంటల ఉచిత విద్యుత్ రాదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పాలిట, మిషన్ భగీరథ, డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌లకు అర్పిడీసీఎల్ శాపమని పేర్కొన్నారు. రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే చాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని.. శనివారం ఎమ్మెల్సీ కోదండరాం అధికారికంగా ఇదే విషయం చెప్పారని గుర్తు చేశారు. తాము ఏది మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతామని పేర్కొన్నారు.


దమ్ముంటే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తేనే ఓటు అడుగుతామని చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. ఏ ఊరికైన వెళ్లదాం.. 13 గంటల కరెంట కూడా రావడం లేదన్నారు. 24 గంటల కరెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డి మంగళం పాడుతున్నారని మండిపడ్డారు. మీ బడే బాయి చెప్పింది చేస్తున్నట్లు ఉంది.. గుజరాత్‌లో 8 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారని వ్యంగ్యంగా అన్నారు. జీవో నం 8 ప్రకారం అర్పిడీసీఎల్‌కు రెన్యువబుల్ ఎనర్జీ మాత్రమే ఇస్తామంటున్నారన్నారు.

రెన్యువబుల్ కరెంట్ అంటే సోలార్ పవర్.. ఇది ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే వస్తుందన్నారు. థర్మల్ పవర్ మాత్రమే కంపెనీలకు పైసలకు ఇస్తారట అంటూ ఆయన వ్యంగ్యంగా అన్నారు. కానీ సోలార్ ఎనర్జీ మాత్రం రైతులకు ఇస్తారట.. అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలను అర్పిడీసీఎల్ కింద వేస్తామన్నారు. థర్మల్ పవర్ లేకుండా రాత్రుళ్లు కరెంట్ ఎట్లా ఇస్తారని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు.


హైదరాబాద్‌కు మంచి నీళ్లు రావాలంటే ఎల్లంపల్లి, కృష్ణ, సింగూర్ నుంచి రావాల్సి ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. అర్పిడీసీఎల్ పవర్ 7, 8 గంటలు ఇస్తే తాగు నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అర్పిడీసీఎల్‌తో రైతులను 24 గంటల కరెంటుకు దూరం చేస్తున్నడంటూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. మూడు డిస్కంలతో అనేక సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులతోపాటు ప్రజల మీద భారం పెరుగుతుందన్నారు. టీజీఆర్పీడీసీఎల్ అనేది తుగ్లక్ చర్య అని చెప్పారు. ప్రైవేటైజేషన్ చేయడానికే ఇదంతా కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే దీనిపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.


ఇప్పటికే ముంబయి, బెంగుళూరు నగరాలు ప్రైవేటైజేషన్ అయిపోయాయన్నారు. దీన్ని వెంటనే విరమించుకోవాలని రేవంత్ సర్కారుకు హరీశ్ రావు సూచించారు. బీఆర్ఎస్ హయంలోనే డిస్కంలకు అప్పులు అయ్యాయని అనడానికి సిగ్గు ఉండాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్ రావు చురకలంటించారు. బీఆర్ఎస్ హయాంలో ఏటా రూ. రెండు వేల కోట్లు అప్పు అయితే కాంగ్రెస్ హయంలో ఏటా రూ.10 వేల కోట్లు అప్పు చేసిందని వివరించారు. ఈ రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ డిస్కంలు చేసిన అప్పు రూ. 25,284 కోట్లుగా ఉందని గణాంకాలతో సహా ఆయన వివరించారు. అర్పిడీసీఎల్.. రైతాంగానికి ఉరి తాడుగా మారనుందని ఆవేదన వ్యక్తం చేశారు. పద్దతి మార్చుకోకుంటే భారీ ప్రజా ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం

క్రీడల్లో నిజాయతీగా ఆడినవారికి ఉద్యోగాలొస్తాయనడానికి మేమే నిదర్శనం: ఉపాధ్యాయులు

For More AP News And Telugu News

Updated Date - May 31 , 2026 | 06:07 PM