బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాం: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
ABN , Publish Date - Jul 17 , 2026 | 03:12 PM
ప్రతి గ్రామానికీ బ్యాంక్ సేవలు అందించడమే ప్రధాని మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2014 నుంచి గ్రామాలకు బ్యాంక్ సేవలను అందించే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
పల్నాడు, జులై 17: ప్రతి గ్రామానికీ బ్యాంక్ సేవలు అందించడమే ప్రధాని మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నరసరావుపేటలో నిర్వహించిన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014 నుంచి గ్రామాలకు బ్యాంక్ సేవలను అందించే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిరర్థక ఆస్తులతో బ్యాంకుల పనితీరు బాగుండేది కాదని.. బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామన్నారు. తోపుడు బండ్ల వారికి గ్యారంటీ లేకుండా బ్యాంకు లోన్లు వచ్చేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వమే వారికి అండగా నిలబడి లోన్లు అందజేసిందన్నారు.
బ్యాంకు నుంచి లోన్లు తీసుకోవాలనే ఆలోచన గతంలో చాలామందికి ఉండేది కాదని కేంద్ర మంత్రి తెలిపారు. మోదీ సూచనలతో ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్తున్నాయన్నారు. దీని వల్ల ఈరోజు లక్షల మందికి సులువుగా లోన్లు అందుతున్నాయని చెప్పారు. కేవలం నరసరావుపేటతోనే ఆగేది లేదని.. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తామని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ నేతలు చెప్పిన వారికి మాత్రమే బ్యాంకర్లు లోన్లు ఇచ్చేవారని.. వాళ్లు తిరిగి చెల్లించకపోవటంతో ఎన్నో ఇబ్బందులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు గ్రామగ్రామానికి బ్యాంకులు వెళ్లి అక్కడ ప్రజల అవసరాలను కనుక్కుని లోన్లు ఇస్తున్నారని తెలిపారు. అర్హత ఉన్న వారికి తప్పకుండా లోన్లు వచ్చేలా చర్యలు తీసుకున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
మోదీ ఆశీస్సులు, నిర్మల ఆలోచనలతో పరుగులు పెడుతోన్న ఏపీ: పయ్యావుల కేశవ్
పారిశ్రామికవేత్తలుగా మారడానికి పల్నాడు చిరునామా కావాలి: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News