Share News

10 రోజుల్లో మళ్లీ అసెంబ్లీ సమావేశాలు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:41 PM

చట్టసభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు ముఖ్యంగా మహిళలకు వివరించాలని ఎన్డీయే కూటమిలోని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతిలో ఎన్డీయే నేతలు, ఆయా పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

10 రోజుల్లో మళ్లీ అసెంబ్లీ సమావేశాలు: సీఎం చంద్రబాబు
CM Chandrababu In Teleconference

అమరావతి, ఏప్రిల్ 24: చట్టసభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు ముఖ్యంగా మహిళలకు వివరించాలని ఎన్డీయే కూటమిలోని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతిలో ఎన్డీయే నేతలు, ఆయా పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. మహిళ రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర భాగస్వామ్య పక్షాల వైఖరిని ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబును పీవీఎన్ మాధవ్ కోరారు. అందుకు సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.


రాబోయే 10 రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ సమావేశాల వేదికగా ‘ఈ అంశం’ పై చర్చిద్దామన్నారు. మహిళ రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ మినహా అన్ని పక్షాలు సమర్థించాయని ఆయన గుర్తు చేశారు. మహిళ రిజర్వేషన్ బిల్లును మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని వివరించారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోదీ ప్రభుత్వం చట్టం చేసిందన్నారు.


రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక కమిటీని నియమించినట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జనసేన పార్టీ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఈ కమిటీలో ఉంటారని పేర్కొన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్‌లో పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ.. ఇప్పటికే నిడదవోలులో నిరసన ర్యాలీ నిర్వహించిన విషయాన్ని పీవీఎన్ మాధవ్ ప్రస్తావించారు.


ప్రతి ఎమ్మెల్యే.. తన అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాన్ని వివరించాలని నేతలకు సూచించారు. అదే విధంగా త్వరలో ఆ అంశాన్ని ప్రజలకు వివరించేందుకు మూడు ప్రాంతాలు.. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని ఈ టెలి కాన్ఫరెన్స్‌లో కూటమి నేతలు నిర్ణయించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లిక్కర్ స్కాం నిందితుల నివాసాల్లో ఈడీ ఆకస్మిక సోదాలు

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం: రాంచందర్ రావు

For More AP News And Telugu News

Updated Date - Apr 24 , 2026 | 01:00 PM